![Cabinet in AP](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/110624cbnn-add-bkr1a.jpg)
Cabinet in AP : ఆంధ్రప్రదేశ్ లో కూటమి 90 శాతానికి పైగా సీట్లు సాధించి పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో కూటమిలో ఉన్న జనసేన, బీజేపీకి ఏఏ శాఖలు కేటాయిస్తారు. అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. ఏ ప్రాంతానికి, ఏ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, మిత్రపక్షాలకు ఎన్ని స్థానలు కేటాయించాలి. సీనియర్లు, జూనియర్ల మధ్య సమతూకం ఎలా పాటించాలన్న దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది.
మంగళవారం (జూన్ 11) రోజున మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకున్నారన్న విషయంలో వారికే చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కేబినేట్ లో చేరడం ఖారారైనట్లే. ఆయనే ఉప ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఉంది. దీంతో కలుపుకొని నాలుగు స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది. మరో పార్టీ బీజేపీ నుంచి ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ముందు నుంచే కసరత్తు..
జగన్ ఓడిపోవడం ఖాయమని తెలిసిన చంద్రబాబు ఫలితాల కంటే ముందే మంత్రి వర్గంలోకి ఎవరిని తీసుకోవాలన్నదానిపై స్పష్టంగా ఉన్నారని పార్టీ వర్గాల నుంచి టాక్. కానీ, ఫలితాలు రావడంతో దాన్ని ముమ్మరం చేశారు. ఎన్డీయే కూటమి 164 స్థానాల్లో గెలుపొందటంతో.. ఆశావహుల సంఖ్య పెరిగింది. గతంలో విజయం సాధించిన వారితో విడివిడి సమావేశం అయ్యేవారు కానీ ఈ సారి అలా ఎవరితోనూ భేటీ కాలేదు. దీంతో మంత్రివర్గం స్థానం కోసం నేరుగా కలిసి విజ్ఞప్తి చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కనీసం 20 నుంచి 30 మంది సమక్షంలోనే అందరినీ కలిశారు. కొందరు రెండేసిసార్లు వచ్చినా.. ఇతరులు ఉండగానే మాట్లాడారు.
మహిళలు, యువతకు..
కేంద్ర కేబినేట్ లో రాష్ట్రం నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. ఈ సారి అసెంబ్లీలో 21 మంది మహిళలు ఉన్నారు. ఇది గతం కంటే (గతంలో 14) 50 శాతం ఎక్కువ. ఈ సారి యువత కూడా అంతే స్థాయిలో గెలుపొందారు. ఆ మేరకు వారికి కేబినేట్ లో ప్రాధాన్యత పెరిగే వీలుంది. ఇమేజ్ ఉన్నవారికి, రాబోయే పదేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యమున్న వారికి ఈ సారి అధిక అవకాశాలు ఉంటాయన్న భావన వ్యక్తం అవుతోంది. ఇది కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు.