CM Chandrababu : చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు ఓ డిప్యూటీ సర్వేయర్ లంచం తీసుకున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం వద్ద ఓ స్థలాన్ని కొన్నారు. ఆ స్థలం జాతీయ రహదారి పక్కనే ఉంది. అయితే, చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలం వ్యవసాయ భూమి కావడంతో గృహ నిర్మాణం చేసేందుకు కుప్పం టీడీపీ నేతలు భూ వినియోగంగా మార్చి ఈ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని దరఖాస్తును సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో అందజేశారు. అయితే, డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.1.80 లక్షల లంచం ఇవ్వాలని కోరారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ లంచం మొత్తం అందించడంతోనే ఆ పనులు ముందుకు కదిలాయి.
గత నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పానికి వచ్చినప్పుడు ఆయన బస చేసిన ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద స్థానిక నేతల మధ్య ఈ విషయం చర్చకు రాగా కలెక్టర్ సుమిత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీశారు. దాంతో ఈ లంచం బాగోతం వెలుగులోకి వచ్చింది. సర్వే శాఖ ఏడీ గౌస్ బాషాతో శాఖాపరమైన విచారణ చేయించడంతో లంచం తీసకున్న మాట నిజమే అని తేలింది. తన భూమి సర్వే కోసం సద్దాం హుస్సేన్ రూ.లక్ష డిమాండ్ చేసినట్లు గత నెలలో శాంతిపురానికి చెందిన ఓ రైతు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ జరిపిన అధికారులు అది నిజమేనని తేల్చారు. ఈ అంశాలపై సాయంత్రాని కల్లా నివేదిక ఇవ్వాలని సోమవారం జేసీ శ్రీనివాసులు సర్వే ఏడీనీ ఆదేశించారు. రాత్రి డిప్యూటీ సర్వేయర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.