![Washington DC](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/cfe59e24-5267-4252-9cc3-13427c72f64c.jpg)
Washington DC : ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయంతో విదేశాలలో సంబురాలు మిన్నంటుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు మళ్లీ సీఎంగా ఏపీ పగ్గాలు చేపట్టడంపై ప్రవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో టీడీపీ గెలుపుపై ఆ రాష్ట్రమే కాదు విదేశాల్లో కూడా వేడుకలు, ర్యాలీలు, సంబురాలు చేసుకోవడం కేవలం ఏపీ టీడీపీకే చెల్లింది.
వాషింగ్టన్ డీసీలో మూడు పార్టీల నాయకులు, మద్దతు దారులు, అభిమానులు జెండాలు చేతబూని ఎన్డీయేకు అనుకూలంగా నినాదాలు చేశారు. 500 కార్లతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అంతకు ముందు ప్రవాసాంధ్రులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆన్ లైన్ లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ శాసన సభ్యుడు సుజనా చౌదరి, రోషన్ కుమార్, సుందరపు విజయ్ కుమార్, ఎన్ఆర్ఐ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ప్రసంగించారు.
చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘ఈ అఖండ విజయంలో భాగస్వాములైన ఎన్ఆర్ఐలకు అభినందనలు. అనేక వ్యయప్రయాసలకు ఓర్చి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులందరూ జన్మభూమికి వచ్చి కూటమి విజయంలో పాలుపంచుకున్నారన్నారు. వారికి పేరు పేరునా ధన్యవాదాలు’ అన్నారు.
సుజనా చౌదరి మాట్లాడుతూ.. ‘రాక్షస ప్రభుత్వాన్ని తరిమికొట్టడంలో ప్రవాసులు తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐలు కీలకం’ అన్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ.. ‘ఓటర్లు చూపిన విజ్ఞత, ప్రజ్ఞ, చైతన్యం వల్లే ఇంతటి భారీ విజయం దక్కింది’ అన్నారు.
సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో ఆర్థిక నేరస్తులకు, హంతకులకు, అరాచక శక్తులకు చోటు దక్కలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయి’ అన్నారు.
సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘కూటమిగా ఏర్పడడం, మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని పునర్ నిర్మించగలుగుతారనే విశ్వాసం గెలుపునకు పునాది. రాష్ట్రాభివృద్ధికి భవిష్యత్ లోనూ ఎన్ఆర్ఐలు తమ సహాయసహకారాలను కొనసాగించాలి’ అని అన్నారు.
తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన మాట్లాడుతూ.. ‘జగన్ రెడ్డి లాంటి ఉన్మాదులకు ఈ తీర్పు ఓ హెచ్చరిక. టీడీపీ విజయంలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం మరువలేనిదనిది’ అన్నారు.
గుంటూరు మిర్చీ యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ‘కూటమి చారిత్రక విజయం సాధించింది. ఏపీలో కంటే మిన్నగా ప్రవాసుల సంబురాలు అంబరాన్నంటాయి. ఇది ఏ పార్టీకి దక్కని గౌరవం’ అన్నారు.
ఈ సభా కార్యక్రమాన్ని భాను మాగులూరి సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి, యాష్ బొద్దులూరి, వేణు పులిగుజ్జు, విజయ్ గుడిసేవ, సాయి బొల్లినేని, అనిల్ ఉప్పలపాటి, త్రిలోక్ తదితరులు ప్రసంగించారు. నరేన్ కొడాలి, శ్రీరామ్ తనికెళ్ల, చంద్ర బేవర, ప్రవీణ్ దాసరి, సతీష్ చింత, చౌదరి యలమంచిలి, రాజేష్ కాసరనేని, రమేష్ గుత్తా, సాయిసుధ పాలడుగు, రవి అడుసుమిల్లి, మంజూష గోరంట్ల, రాధికా రామాయణం, సురేఖ చనుమోలు, శుభ ఎర్రంశెట్టి, సంజయ్ నాయుడు, యువ సిద్ధార్థ్ బోయపాటి, కృష్ణ గుడిపాటి, సమంత, మురళి, వినీల్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.