Pawan Nomination : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని చేబ్రోలు నుంచి ఆయన బయల్దేరారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగనుంది. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్ లో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
ర్యాలీలో పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలతో పాటు టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా తన విజయం కోసం ఒంటిపూట భోజనంతో నియోజకవర్గంలో సైకిల్ పై ప్రచారం చేస్తున్న వీరాభిమాని మామిడి బాబ్జీని పవన్ అభినందించారు. బాబ్జీ సైకిల్ ను పవన్ కూడా తొక్కి అభిమానులను, కార్యకర్తలను ఉల్లాసపరిచారు.