Peddapally District : పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ముత్తారం మండలం ఓడేడు గ్రామ పరిధిలో మానేరుపై ఉన్న వంతెన గిర్డర్లు ఈదురుగాలులకు కూలిపోయాయి. రాత్రి వేళ ఈ ఘటన జరగడంతో ఎవరికీ ఏం కాలేదు. ముత్తారం మండలం ఓడేడు గ్రామం నుంచి జయశంకర్ జిల్లా గర్మిళ్లపల్లి మధ్య దూరం తగ్గించడానికి వాగుపై ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు.
2016లో రూ. 49 కోట్లతో వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లు కావస్తున్నానిర్మాణ పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. నిర్మాణంలో నాణ్యతా లోపాలే వంతెన కూలిపోవడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. వంతెన వాడుకలోకి వచ్చిన తర్వాత కూలి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.