Virat Kohli and Rohit Sharma : 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్కప్ టైటిల్ను గెలుచుకున్న టీమిండియా స్వదేశానికి రాగా, ఘనస్వాగగతం లభించింది. వెస్టిండీస్లో టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా జూలై 4న స్వదేశానికి తిరిగి వచ్చింది. వారికి లభించిన స్వాగతం కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతుంది. న్యూఢిల్లీలో దిగిన తర్వాత ముందుగా ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన టీమ్ ఇండియా, ఆ తర్వాత ముంబైకి చేరుకుంది. ఇక అక్కడి వాతావరణం చూస్తుంటే పండుగను తలపించింది.ఈ వేడుకలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి వాంఖడే స్టేడియంలో డ్యాన్స్ చేయడం మరింత ఉత్సాహాన్ని నింపింది.
ప్రపంచకప్ గెలిచి తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్లు స్వదేశానికి ఎప్పుడెప్పుడు వస్తారా అని క్రికెట్ క్రీడాభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత, టీమిండియా కృషి ఫలించింది… దేశం మొత్తం సంబురాల్లో మునిగితేలింది. ముంబైలో, ముందుగా విజయోత్సవ ఊరేగింపు ఓపెన్ టాప్ బస్సులో వాంఖడే స్టేడియం వరకు సాగింది. వేలాది మంది అభిమానులు బస్సు వెంటే నడిచారు.
వాంఖడేలో తొలిసారి
విజయోత్సవ పరేడ్ పూర్తయిన తర్వాత వాంఖడే స్టేడియంలో వేలాది మంది అభిమానులు టీమ్ ఇండియా క్రీడాకారులను కళ్లారా చూసేందుకు వేచి ఉన్నారు. టీమ్ ఇండియా ప్లేయర్లు స్టేడియం లోపలికి చేరుకోగానే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. టీమ్ ఇండియా, ఆటగాళ్ల పేరుతో నినాదాలు చేశారు. వారు మైదానంలోకి దిగిన వెంటనే, విరాట్ కోహ్లీ నాసిక్లోని ప్రసిద్ధ డ్రమ్మర్లు ప్రదర్శన ఇస్తున్న అభిమానుల వద్దకు కెప్టెన్ రోహిత్ శర్మతో సహా మొత్తం జట్టును తీసుకెళ్లాడు. తర్వాత కోహ్లీ, రోహిత్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. వారిని చూసి మిగతా టీమ్ సభ్యులు కూడా ఆగలేక డ్యాన్స్ చేయడంతో స్టేడియం అంతా ఊగిపోయింది. రోహిత్, కోహ్లి కలిసి డ్యాన్స్ చేయడాన్ని తొలిసారిగా చూసే అవకాశం భారత అభిమానులకు దక్కింది.
ప్రతిధ్వనించిన వందేమాతరం
జస్ప్రీత్ బుమ్రా కూడా ఈసారి డ్యాన్స్ చేయడం కనిపించింది. బహుశా మొదటిసారిగా, జట్టు అంతా ఇలా డ్యాన్స్ చేయడం అభిమానులకు చూసే అదృష్టం కలిగింది. ఇది అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. వేడుక ముగిసిన తర్వాత, టీమ్ ఇండియా మైదానం చుట్టూ తిరిగింది. మరోసారి విరాట్ మొత్తం టీమ్ తో కలిసి ఏఆర్ రెహమాన్ స్వరపర్చిన ‘వందేమాతరం’ని పాడమని కోరాడు. అభిమానులు కూడా ఈ పాటను ఆలపించడంతో స్టేడియం అంతా ప్రతిధ్వనించింది.