AP News : ఏపీలో గుంతల రోడ్లు మనుషుల ప్రాణాలను బలిచేస్తున్నాయి. గుంతల్ని చూసి అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ఒకరు, బురదతో నిండిపోయిన గోతుల్లో పడి మరొకరు మంగళవారం మృతి చెందారు.
చింతలపూడి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఆలేటి రామ్ చంద్, జ్యోతి (34) దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రామ్ చంద్ బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు పశు వైద్యశాలలో వెటర్నరీ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. దీంతో అక్కడికి దగ్గరలోని తెనాలి సుల్తానాబాద్ లో కుటుంబంతో సహా ఉంటున్నారు. మంగళవారం రాత్రి వారి కుమార్తెల నృత్య ప్రదర్శన ఉండడంతో చూసేందుకని రామ్ చంద్, జ్యోతిలు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. చింతలపూడి వద్దకు రాగానే రోడ్డుపై పెద్ద ఎత్తున ఉన్న గుంతలను చూచి రామ్ చంద్ అకస్మాత్తుగా బ్రేకులు వేశారు. జ్యోతి కంగారుపడి ముందుకు దూకేయడంతో ఆమె ముఖం రోడ్డుకు బలంగా తాకి స్పృహ కోల్పోయింది. వెంటనే తెనాలి ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆమె మృతి చెందింది.
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన వడ్లమూడి మహాలక్ష్మీ కోటేశ్వరరావు (61) సోమవారం రాత్రి సరకులు కొనడానికి మోటారు సైకిల్ పై మార్కెట్ కు వెళ్లారు. చీకటిలో ఆయన తిరిగి వస్తుండగా గుంతలు పడి బురదమయంగా ఉన్న రోడ్డుపై వాహనం జారి కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అటుగా వస్తున్న యువకులు కోటేశ్వర రావును గమనించి సపర్యలు చేశారు. ఆయన ఊపిరి తీసుకుంటున్నాడని గుర్తించి వెంటనే 108 అంబులెన్స్ లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. కోటేశ్వరరావు రోడ్డుపై నిలిచిన బురద కారణంగానే మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు.