అయితే గడ్డుపరిస్థితుల నుంచి బయట పడిన విరాట్ కోహ్లీ ప్రత్యర్థులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. విరాట్ 2.0 అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారంటే ఆయన ఆటతీరులో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 2022 సెప్టెంబర్ లో అసియా కప్ టీ 20 సిరీస్ లో అఫ్గానిస్థాన్ పై సెంచరీ తర్వాత మరింత దూకుడు పెంచాడు. 2019-22 మధ్య కాలంలో ఒక్క సెంచరీ కూడా చేయని కోహ్లీ ఆ తర్వాత ప్రత్యర్థులకు అత్యంత ప్రమాదకారిగా తయారయ్యాడు.
ప్రస్తుతం తన కెరీర్ లో కోహ్లీ 71 వ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న కోహ్లీ ని ఆపడం సాధ్యం కావడం లేదు. ఇక తాజాగా ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ పై సెంచరీ (122 నాటౌట్) చేసి, జట్టేదైనా తన ఆట ఇంతే అన్నట్లుగా ఆడాడు. ఇక కోహ్లీ కి తోడుగా కేఎల్ రాహుల్ (111 నాటౌట్ ) నిలిచాడు. కోహ్లీ ఫామ్ ను తట్టుకోలేక సీనియర్ బౌలర్లు కూడా చేతులెత్తేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వరల్డ్ కప్ లో కూడా ఇదే ఫామ్ కొనసాగితే భారత్ కు కప్పు గెలిచే చాన్స్ ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తవమవుతున్నది. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లపై కూడా కోహ్లీ తన దైన శైలిలో ఆడాడు. ఏదేమైనా కోహ్లీ ఫామ్ ఇప్పుడు భారత అభిమానుల్లో పూర్తి ఆనందాన్ని నింపుతున్నది.