T20 World Cup : వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి బాధ నుంచి టీమిండియా ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇండియాలోనే ఆసీస్ జట్టుపై టీ-20 సిరీస్ గెలువడం, ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో ఆడిన టెస్టు సిరీస్ ను సమం చేయడం..ఇలా ఒక్కొక్క సిరీస్ తో మళ్లీ గాడినపడుతోంది. వీటన్నంటి కంటే ప్రధానమైనది టీ-20వరల్డ్ కప్.. దీన్ని గెలిచి అభిమానులకు గిఫ్ట్ గా ఇవ్వాలని ప్రతీ భారత ఆటగాడు కోరుకుంటాడు. అందుకే ఇప్పటి నుంచే ఆ సమరం కోసం సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి.
వెస్టిండీస్, యూఎస్ వేదికగా జూన్ 1 నుంచి టీ-20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ శుక్రవారమే విడుదల చేసింది. మొత్తం ఐదు వేదికల్లో టోర్నీ జరుగనుంది. 20 జట్టు పాల్గొనే ఈ టోర్నీలో మొత్తం ఐదేసి జట్లతో 4 గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్తాన్ జట్లు గ్రూపు-ఏలో ఉన్నాయి. ఇక ఈ టోర్నీలో జూన్ 1న అమెరికా, కెనడా జట్ల మధ్య ప్రారంభ మ్యాచ్ జరుగనుంది. టీమిండియా-ఐర్లాండ్ మ్యాచ్ జూన్ 5న, పాక్ తో మ్యాచ్ 9న జరగనుంది.
ప్రపంచకప్ కు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. కానీ ప్రపంచకప్ లో ఆడబోయే జట్టుపై ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి. జట్టులో ఎవరెవరినీ ఎంపిక చేస్తారు అనే విషయాలపై డిస్కషన్స్ జరుగుతున్నాయి.
కాగా 2022లో జరిగిన టీ-20 ప్రపంచకప్ లో ఆడిన రోహిత్ శర్మ మళ్లీ ఇప్పటివరకూ ఒక్కా టీ-20 మ్యాచ్ ఆడలేదు. అయితే రాబోయే ప్రపంచకప్ ను ఆయన ఆడనున్నారు. అతడే కెప్టెన్ గా ఉండనున్నారు. విరాట్ కోహ్లి కూడా ఆడుతారని వార్తలు వినిపిస్తున్నాయి. వన్ డౌన్ లో వస్తాడని కూడా అంటున్నారు.
ఇక ఏడాది కింద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ కూడా ఈ టోర్నీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంతకుముందే జరిగే ఐపీఎల్ నుంచే అతడు మైదానంలో అడుగుపెడుతాడని అంటున్నారు.
రాబోయే టీ-20 ప్రపంచకప్ లో ఆడే భారత జట్టు ఇలా ఉండొచ్చని తెలుస్తోంది. రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, పాండ్యా, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, రవి బిష్ణోయ్, సిరాజ్, బుమ్రా, అర్షదీప్ సింగ్.