Credit Cards New Rules : ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు వాడే వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఆన్ లైన్ లో వస్తువులు కొనడం, ఆఫ్ లైన్ లో షాపింగ్ చేయడం, కరెంట్ బిల్లులు కట్టడం..ఇలా ఒకటేమిటి చెల్లింపులన్నీ క్రెడిట్ కార్డులనే వాడుతున్నారు. అయితే కొన్ని ప్రత్యేక కార్డుల్లో ఆయా క్రెడిట్ కార్డు సంస్థలు క్లెయిమ్ చేసుకుని ఇతర వస్తువులు వంటివి ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. తాజాగా కొన్ని బ్యాంకులు అందిస్తున్న క్రెడిట్ కార్డు లాంజ్ యాక్సెస్, రివార్డు పాయింట్ల విషయంలో కీలక మార్పులు చేస్తున్నాయి. ఆ వివరాలు ఒకసారి చూద్దాం..
యాక్సిస్ బ్యాంక్:
మాగ్నస్ క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ తో పాటు వార్షిక రుసుముల్లో కీలక మార్పులను తీసుకొచ్చింది. బీమా, గోల్డ్, ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్ పాయింట్లూ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఎస్ బీఐ:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ఇకపై ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఎస్ బీఐ అందిస్తున్న ఆరమ్ ఎస్ బీఐ కార్డ్ ఎలైట్, సింప్లీ కిక్ కార్డులు వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం పడనుంది.
ఐసీఐసీఐ:
కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని సవరించింది. రానున్న త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే మునపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.35వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డు సహా వివిధ కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మార్పులు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.
యస్ బ్యాంక్:
ఐసీఐసీఐ బ్యాంక్ తరహాలోనే యస్ బ్యాంక్ కూడా లాంజ్ యాక్సెస్ లో నిబంధనల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఏ త్రైమాసికంలో లాంజ్ సదుపాయం పొందాలన్నా అంతకుమ మునపటి త్రైమాసికంలో కార్డ్ ద్వారా కనీసం రూ.10వేలు వెచ్చించాల్సి ఉంటుంది.