BRS Party : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సీఎం రేవంత్ నిన్న (గురువారం) రాత్రి ఢిల్లీ నుంచి రాగానే వారికి దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాజా చేరికలతో మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. తెలంగాణ మండలిలో మొత్తం ఎమ్మెల్సీల సంఖ్య 40 అయితే ప్రస్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మిగతా 38 మందిలో కాంగ్రెస్ కు నిజానికి నలుగురు మాత్రమే ఉన్నారు. మిగతా 8 మంది బీఆర్ఎస్ నుంచి వచ్చినవాళ్లే. బీజేపీకి ఒకరు, ఎంఐఎంకు ఒక ఎమ్మెల్సీ ఉండగా, ఇద్దరు ఇండిపెండెంట్స్ ఉన్నారు.
ఇప్పటివరకూ ఎమ్మెల్యేలే అనుకుంటే తాజాగా, ఎమ్మెల్సీలు కూడా అదేబాట పట్టారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి వచ్చీ రాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, దండే విఠల్, భానుప్రసాద్, ప్రభాకర్ రావు, దయానంద్, ఎగ్గే మల్లేష్ లు కాంగ్రెస్ లో చేరిపోయారు.