Confusion in T BJP : తెలంగాణ బీజేపీలో పూర్తి అయోమయం నెలకొంది. పార్టీలో ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టంగానే ఉంది. పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇప్పటికే చేతులెత్తేసినట్లు సమాచారం.అసలే బలమైన అభ్యర్థులు లేరంటే, మొదటి జాబితా ప్రకటన కూడా అత్యంత పేలవంగా ఉంది. దీంతో పార్టీ నేతలు కొందరు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇప్పటికే కోమటిరాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమైపోయింది.
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి టికెట్ ఆశించిన మాజీ ఎంపీ వివేక్ కు బీజేపీ అక్కడ కాకుండా చెన్నూర్ నియోజకవర్గాన్ని కేటాయించింది. దీనిపై ఆయన కూడా కొంత నిరాశతో ఉన్నారు. భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య కూడా బీజేపీ ని వీడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మునుగోడు లేదా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నుంచి తనకు టికెట్ కేటాయించాలంటూ ఆయన కోరారు. ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆయనకు ఇప్పటివరకు ఎక్కడా టికెట్ ప్రకటించలేదు.
మహబూబ్ నగర్ లోక్ సభ స్థానానికి పోటీ పడుతున్న మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇద్దరు పార్టీకి తలనొప్పిగా మారారు. గద్వాలలో సీనియర్ న్యాయవాది అయిన వెంకటాద్రి రెడ్డి నిలబెట్టి, తనకు ఎంపీగా అవకాశమివ్వాలని ఆమె కోరుతున్నారు. ఇక జితేందర్ రెడ్డి కూడా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ముఖేశ్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీలో ఇప్పుడు అసంతృప్త జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇక ఎన్నికల ముందు ఇది అధిష్టానానికి తలనొప్పిగా మారింది.