Telangana BJP : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మింగుడుపడడం లేదు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అన్న పార్టీ, కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసిన పార్టీ.. మూడో స్థానానికి పడిపోవడంతో ఆ పార్టీ నేతలకు నిద్రపట్టడం లేదు. ఇక ఫలితాలు వచ్చి పది రోజులు దాటినా కూడా పార్టీలో సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. బండి సంజయ్, ఈటల, కిషన్ రెడ్డి వర్గాల మధ్య పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతోంది.
బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడానికి మాజీ మంత్రి ఈటల రాజేందరే కారణమని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు వైరల్ అయ్యాయి. బండి సంజయ్ అధ్యక్ష పదవిలో ఉంటే కాంగ్రెస్ స్థానంలోకి బీజేపీ వచ్చేదని అందులో వాదనలు చేశారు. ఇదిలా ఉంటే ఈటల రాజేందర్ అనుచరులు వీటికి కౌంటర్ పెడుతున్నారు. తన అనుచరులు అంటూ టికెట్లు ఇప్పించుకున్నా బండి సంజయ్ వారిని గెలిపించుకోలేకపోయారని, ఇక అధికారంలోకి ఎలా తెస్తారని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఇవి పార్టీలో తీవ్ర కలకలం రేపుతుండడంతో ఎట్టకేలకు రాజేందర్ స్పందించి.. సోషల్ మీడియాలో తన అనుచరుల పేరుతో వస్తున్న పోస్టులన్నీ ఫేక్ అని ప్రకటించారు.
సోషల్ మీడియా వార్ లో బండి, ఈటల మాత్రమే కాదు.. అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సైతం తీవ్రంగా కామెంట్లు పెడుతున్నారు. పార్టీ ఓటమికి ఆయనే కారణమని విమర్శిస్తున్నారు. ఆయన కనీసం అంబర్ పేటలో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోలేకపోయారని మండిపడుతున్నారు. అయితే సోషల్ మీడియా వార్ పై రాష్ట్ర పెద్దలు స్పందించపోవడంతో మరింత పెరిగిపోతున్నాయి. తాజాగా బండి సంజయ్ కు మళ్లీ బాధ్యతలు ఇస్తున్నారని ఓ వర్గం ప్రచారం చేస్తుంటే.. మరో వర్గం మాత్రం వెటకారంగా ఎద్దేవా చేస్తోంది.
మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు బీజేపీలో మంటలు రేపుతున్నాయి. మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. వర్గ విభేదాలు మానుకుని ఆ ఎన్నికల్లోనైనా సత్తా చాటుతారేమో చూడాలి. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి జంప్ కావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.