Delhi Liquor Scam :
ఢిల్లీ లిక్కర్ స్కాం కొన్ని రోజుల క్రితం దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపింది. ప్రముఖుల పాత్ర ఉందంటూ వచ్చిన హడావుడి నేపథ్యంలో పెద్ద ఎత్తున సంచలనమైంది. ఇక ఈడీ కూడా అదేస్థాయిలో ఢిల్లీలో వరుస అరెస్ట్ లు, విచారణలు చేపట్టింది. ఏమైందో ఏమో గాని ఒక్కసారిగా ఈ కేసు విషయంలో సైలెంట్ గా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసొడియా సహా తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత, వైసీపీ నేతలు సహా మరికొందరి పాత్ర ఉన్నట్లు ఈడీ నాడు ప్రకటించింది. అయితే విచారణ కూడా వేగంగా మొదలు పెట్టింది.
తెలంగాణ సీఎం కూతురు, ఎమ్మెల్సీ కవితను వరుసగా విచారణల పేరిట ఢిల్లీకి పిలిపించుకుంది. ఈ సమయంలో తెలంగాణలోనూ ఇక కవిత అరెస్ట్ ఖాయమంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అంటూ తెలంగాణ ప్రజలంతా టీవీల ముందు కూర్చుండిపోయారు. ఇక ఆ తర్వాత ఈడీ కొంత కాలం గ్యాప్ తీసుకుంది. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ఢిల్లీకి పిలిచింది. రెండు రోజులుగా విచారణ చేపడుతున్నది. ఈ స్కాంలో బుచ్చిబాబు పాత్ర కీలకమని ఈడీ భావిస్తున్నట్లుగా సమాచారం.
ఇక కవిత అరెస్ట్ ఖాయమని ప్రచారం జరిగిన నేపథ్యంలో పలువురు అప్రూవర్లుగా మారారు. దీనికి సీబీఐ, ఈడీ కూడా అంగీకరించడం, వారికి బెయిల్ లభించడం కూడా చకచకా జరిగిపోయాయి. అయితే ఇదంతా దక్షిణాది రాష్ర్టాలకు చెందిన వారికి మాత్రమే ఊరట లభించినట్లు స్పష్టమవుతున్నది. ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన వారు ఇంకా జైళ్లోనే ఉన్నారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఇంకా బెయిల్ కూడా లభించలేదు.
ఇక మరోసారి ఢిల్లీలో ఈడీ కదలికలు పెరిగాయి. రాజకీయ కోణంలోనే ఈ మూమెంట్స్ ఉన్నట్లు సమాచారం అందుతున్నది. అయితే తెలంగాణలో కేసీఆర్ మాత్రం బీజేపీపై అంత దూకుడు గా లేరు. బీఆర్ఎస్ విస్తరణ విషయం కూడా వదిలేశారు. మహారాష్ర్ట అంశంలోనూ సైలెంట్ అయ్యారు. మరి ఎవరి కోసం ఈడీ రంగంలోకి దింగుతుందనడానికి ఆధారాలు లేవు. ఏ సమయంలోనైనా మరిన్ని అరెస్టులు ఉంటాయని మాత్రం తెలుస్తున్నది. అయితే అది ఎవరు అనేది మాత్రం తేలాల్సి ఉంది.