![CM Chandrababu](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/cbn.jpg)
CM Chandrababu : ఏపీలో అధికారం చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఇసుక పాలసీ పైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సామాజిక భద్రతా పింఛన్ల పెంపు నిర్ణయాన్ని అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరో హామీ అమలుకు రెడీ అయింది. తాజాగా ఆయన ఏపీలో ఇసుక పంపిణీ విధానంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. జులై 8నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రను చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాట చేసి దాని ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా చార్జీలు నిర్ణయించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సమయంలో ఉచిత ఇసుక విధానం తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ మేరకు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నెలరోజులలోపే నూతన ఇసుక పాలసీని తీసుకువస్తున్నారు.
ఇటీవల సుదీర్ఘంగా ఇసుక విధానం పైన సమీక్ష నిర్వహించిన చంద్రబాబు జగన్ పరిపాలన సమయంలో ఇసుక పాలసీ వల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, గృహ నిర్మాణరంగం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఇసుక మాఫియాగా ఏర్పడి భారీగా ధరలను పెంచి, ప్రజలను ఇబ్బందుల పాలు చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. తక్షణమే ఇసుక ధరలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేయడంతో పాటు ఇసుక రీచ్ లు, స్టాక్ పాయింట్ల వద్ద ఎంత ఇసుక అందుబాటులో ఉందో లెక్క చెప్పాలని చంద్రబాబు అధికారులను ప్రశ్నించారు. దీంతో ప్రస్తుతం 40 లక్షల టన్నులు ఇసుక అందుబాటులో ఉందని అధికారులు ముఖ్యమంత్రికి లెక్క చెప్పారు.
ఇక తాజాగా ఉచిత ఇసుక విధానం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జులై 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధాన అమలులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం పై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం ప్రవేశ పెట్టడం శుభ పరిణామన్నారు. గత ఐదేళ్లు ఇసుక పేరుతో వైసీపీ నేతలు దోపిడీ చేశారని ఆరోపించారు. ఇకపై ఎవరికి ఇసుక కావాలన్నా సులభంగా అందేలా చూస్తామని పేర్కొన్నారు.