Alapati Rajendra Prasad : వైద్యో నారాయణో హరి అనే నానుడిని పూర్తిగా నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి దేశం మొత్తం మీద జగన్ రెడ్డి ఒక్కరే అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. ఆయన మాటలు కోటలు దాట తాయనీ చేతలు మాత్రం చేతులు కూడా దాటవు అన్నారు. సీఎం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వైద్య విపత్తు తలెత్తిందన్నారు. దేవుని దయ, పేదల కోసమే నేను వచ్చానని కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడనీ ఆయన విమర్శించారు.
ఆరోగ్య సురక్ష కింద ఇంటింటికి వైద్యం కేవలం ఎన్నికల స్టంట్ గానే మిగిలిపోయింది. పీహెచ్ సీల్లో కనీసం సిబ్బంది లేదు. వైద్యులు లేరు. జ్వరం బిళ్ల లు కూడా దొరకని పరిస్థితి. టీడీపీ హయాంలో నెలకొల్పిన డయాలసిస్ కేంద్రాలను కూడా మూసే శారంటే వైద్యఆరోగ్య శాఖ ఎలా పనిచేస్తుందో అర్ధం చేసుకోవచ్చు అనీ ఆయన మండిపడ్డారు.
ఆరోగ్యశ్రీతో పేదలకు ఆరోగ్యం అంటూ సాక్షిలో భారీ ప్రకటనలకు వందలకోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసిన జగన్ రెడ్డి .పథకం ద్వారా ఒక్క పేదకైనా ఉచిత వైద్యం అందించారా? పేదల ఆరోగ్యంపై జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు రూ. 1500 కోట్లు ఎందుకు చెల్లించడంలేదు? బిల్లులు రాక వైద్యం చేసేందుకు ఆస్పత్రులు ముందుకు రాకపోవడంతో పేదల ప్రాణాలు పోతున్నాయనీ ఆలపాటి ఆరోపించారు.
ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించడానికి మనసురాని జగన్ రెడ్డి తన బినామీ కాంట్రాక్టర్లకు మాత్రం అప్పులు తెచ్చి మరీ కోట్ల రూపాయిల బిల్లులు చెల్లించి కమీషన్లు దండుకుంటున్నాడు. ఎలక్షన్ కోడ్ కు 10 రోజుల ముందు తన అస్మదీయ కాంట్రాక్టర్లకు జగన్ రెడ్డి అక్షరాలా రూ. 6,500 కోట్లు చెల్లించి కమీషన్లు అందుకున్నాడు. బిల్లుల చెల్లింపు కోసం ఏకంగా రూ. 4,700 కోట్లు అప్పులు తెచ్చింది వాస్తవం కాదా? కమీషన్ల కోసం కక్కుర్తి పడి పేదవారి ప్రాణాలు తీసే హక్కు మీకెక్కడిది? వైద్యం కోసం అప్పులు చేస్తున్న పేదలు అవి తిరిగి చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్నారనీ ఆలపాటి విమర్శించారు.
పేదలు చచ్చిపోయినా పర్లేదు తాడేపల్లి ప్యాలెస్ ఖజానా మాత్రం నిండాలి. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 15వ ఆర్థిక సంఘం 2023-24 కింద రూ. 514 కోట్లు నిధులిస్తే కేవలం రూ. 25 కోట్లు మాత్రమే విడుదల చేసి మిగిలిన సొమ్ము దారి మళ్లించేసింది నువ్వు కాదా జగన్ రెడ్డి? అభయహస్తం నిధులు రూ. 2118 కోట్లు జగన్ రెడ్డి దారి మళ్లించేసింది నిజం కాదా? గతంలో చంద్రబాబు గారు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా మెరుగైన వైద్యం అందిస్తే జగన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పేరుతో ప్రచారమే తప్పా చేసిందేమీ లేదు. ఈ ఐదేళ్లలో పేదలకు చేసిన ఒక్క మంచి పనైనా చేశానని జగన్ రెడ్డి చెప్పగలరా?