![TANA](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/HMK7FJb.jpg)
TANA : తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే సాహిత్య సమావేశాల్లో భాగంగా జూన్ 30వ తేదీ 68వ అంతర్జాతీయ టెలీ వీడియో కాన్ఫరెన్స్ లో ‘స్ఫూర్తిదాయకమైన ప్రతిభామూర్తుల జీవితచరిత్రలు’ సదస్సు జరిగింది. తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకుడు డా. ప్రసాద్ తోటకూర అతిథులను ఆహ్వానించి సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతిభామూర్తుల జీవిత చరిత్రలు చదవడం వల్ల కేవలం వారి జీవితం గురించే కాకుండా ఆనాటి సాంఘిక, సంస్కృతిక, రాజకీయ స్థితిగతులు, ప్రజల జీవనవిధానం మొదలైన ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. వారు తమ జీవితాల్లో ఎదుర్కొన్న సమస్యలు, ఆటుపోట్లు వాటిని అధిగమించేందుకు వారు చేసిన పోరాటం నేర్చుకోవచ్చు. అందువల్ల తెలుగు సాహిత్య ప్రక్రియల్లో జీవిత చరిత్రలు, ఆత్మకథలు కీలక భూమిక పోషిస్తాయి’ అన్నారు.
కృష్ణా జిల్లా, ముదునూరు గ్రామంలో ‘జీవిత చరిత్రల గ్రంథాలయం’ వ్యవస్థాపకుడు డా. నాగులపల్లి భాస్కరరావు విశిష్ట అతిథిగా సదస్సులో పాల్గొని గ్రంథాలయ ఏర్పాటు వెనుక ఉన్న ఆశయం, నిర్వహణ తీరును వివరించారు. విశిష్ట అతిథులుగా సుప్రసిద్ధ రచయిత్రి ఆచార్య డా. సీ మృణాళిని ప్రముఖ రచయిత బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి రచించిన ‘మా జ్ఞాపకాలు’ జీవిత చరిత్రను బీనాదేవి పేరుతో భార్యాభర్తలు కలిసి జంటగా రాసిన రచనలను ‘బీనాదేవీయం’ అనే గ్రంథాల్లో ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత డా. జీవీ పూర్ణచందు తెలుగువారికి పరిచయమైన తమిళనాట ఆధ్యాత్మికరంగంలో ఎనలేని కృషి చేసిన తెలుగు ప్రముఖులు ‘అప్పయ్య దీక్షితులు’, ‘అల్లూరి వెంకటాద్రిస్వామి’ జీవిత చరిత్రల్లోని పలు విశేషాలను పంచుకున్నారు.
ప్రముఖ సాహితీవేత్త కిరణ్ ప్రభ, రష్యన్ యువతి కేవలం భారతీయ నృత్యకళలపై ఆసక్తితో తన పేరును ‘రాగిణీదేవి’గా మార్చుకొని ఎన్నో సాహసాలతో భారత్ లో అడుగుపెట్టి, అనేక సంవత్సరాలు కృషి చేసి ఆమె నాట్యం తీరును వివరించారు. నాట్యశాస్త్రంపై ఆమె గ్రంథాలను రాయడం.. తన కుటుంబం మొత్తం ఎలా నాట్యకళకు జీవితం అంకితం చేసుకుందో వంటి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస వరకు గిడుగు చేసిన ఒంటరి పోరాటాన్ని, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు ‘గిడిగు వెంకట రామమూర్తి’ జీవితంలోని అనేక కోణాలను కిరణ్ ప్రభ విశ్లేషించారు. సాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇలాంటి సాహితీ సమావేశాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం అవసరం అన్నారు.