కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం.. ప్రముఖ నటుడు శరత్ బాబు చనిపోయారంటూ అంతటా హోరెత్తింది. పలు మీడియా సంస్థలు కూడా రాసుకొచ్చాయి. చాలా మంది సీనీ సెలబ్రెటీలు అయ్యో అంటూ కాల్స్ చేసి ఆరాతీయడం ప్రారంభించారు.
శరత్ బాబు కొద్దిరోజులుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఆయన కండిషన్ విషమంగా మారినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనను కాపాడేందుకు వైద్య బృందం శ్రమిస్తున్నారని చెప్పారట. అయితే శరత్ బాబు కన్నుమూశారని కొందరు ప్రచారం మొదలుపెట్టారు. ఇండస్ట్రీ ప్రముఖులు కొందరు ఆయన మరణించినట్లు ధృవీకరిస్తూ సోషల్ మీడియా పోస్ట్స్ చేశారు.
ఈ ప్రకటనలపై కుటుంబ సభ్యులు స్పందించారు. సోషల్ మీడియా లో శరత్ బాబు గారి గురించి వచ్చే వార్తలు అన్ని తప్పుడు వార్తలు అంటూ ఖండించారు.. శరత్ బాబు కొంచెం రికవరీ అయ్యి, రూమ్ షిఫ్ట్ చేశామని.. తొందరలోనే శరత్ బాబు గారు పూర్తిగా కోలుకొని మీడియాతో మాట్లాడుతారు అని శరత్ బాబు కుటుంబ సభ్యులు, సోదరి తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఏవి నమ్మవద్దు అని విజ్ఞప్తి చేశారు.
శరత్ బాబుది శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస. నటనపై మక్కువతో మద్రాస్ వెళ్లి నటుడిగా ప్రయత్నాలు చేశారు. చక్కటి రూపం కలిగిన శరత్ బాబు హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల చిత్రాల్లో నటించారు. అయితే పెద్ద హీరో కాలేకపోయారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితంలో చాలా వివాదాలు ఉన్నాయి. నటి రమప్రభను వివాహం చేసుకొని విడాకులు తీసుకున్నారు. శరత్ బాబుపై రమప్రభ తీవ్ర ఆరోపణలు చేశారు. నన్ను శారీరకంగా, కెరీర్ కోసం దోచుకున్నాడని 14 ఏళ్లు నటిస్తూనే కాపురం చేశాడని ఆరోపించింది. 1990లో స్నేహ నంబియార్ ను రెండో వివాహం చేసుకున్న శరత్ బాబు ఆమెతో కూడా విడిపోయాడు.