BRS thinking
BRS thinking : ‘మరో రెండు నెల్లలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. మళ్లీ మరో సారి మనమే అధికారంలోకి రాబోతున్నాం. మరో 15 ఏళ్లు మనమే అధికారంలో ఉండబోతున్నాం. కనుక ఎన్నికల్లో ఓడిపోయామని పక్క చూపులు చూడవద్దు. ఎవరూ గోడ దూకొద్దు.’ ఇది సీఆర్ ఇటీవల ఫామ్ హౌజ్ మీటింగ్ లో చెప్పిన మాటలు.
కానీ అది ఎలా సాధ్యమో.. అందునా రెండు నెలల్లో ఎలా సాధ్యమన్న దానిపై అధినేత క్లారిటీ ఇవ్వలేదు. కనుక కేసీఆర్ తమను మభ్యపెట్టేందుకు పిట్ట కథలు చెపుతున్నారని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లున్నారు. అందుకే అర్ధరాత్రి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. అంతవరకు వారందరూ ఓ స్టార్ హోటల్లో ఓపికగా వేచి చూసి, సీఎం రాగానే జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పించుకొని పార్టీలో చేరిపోయారు.
ఈ సంఘటనను పరిశీలిస్తే బీఆర్ఎస్ నుంచి బయటపడేందుకు ఆ పార్టీ నేతలు ఎంత ఆతృతగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం కోల్పోతున్నట్లు స్పష్టం అవుతుంది.
రేవంత్ సర్కార్ ను కూల్చి అధికారం చేజిక్కించుకోవాలని తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ మాటలను బట్టి చూస్తే అర్థం అవుతుంది. ఈ ఆలోచన బీఆర్ఎస్ కు ఆమోదయోగ్యం కాదని ఈ ఫిరాయింపులు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ వారికి ఆమోదమైతే అందరూ కేసీఆర్ వెంటే ఉండేవారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కేసీఆర్కు సహకరించి ఉండేవారు కదా?
మరో విషయం ఏంటంటే.. రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేసీఆర్ అనుకోవడం వల్ల రేవంత్ ముందు జాగ్రత్త పనులు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. అంటే ఆ విధంగా మాట్లాడి కేసీఆర్ వ్యూహాత్మక తప్పు చేసినట్లు భావించవచ్చు. కనుక బీఆర్ఎస్ పార్టీ పతనానికి రేవంత్ ఎంత కారణమో కేసీఆర్ కూడా అంతే కారణమని చెప్పక తప్పదు. కానీ కేసీఆర్ ఇది ఒప్పుకోవడం లేదు. కనుక బీఆర్ఎస్ పతనాన్ని ఎవరూ ఆపలేరు.