Minister KTR : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా తెలంగాణలోని ఐటీ కంపెనీలు నిరసనలు, ధర్నాలు చేపట్టాయి.
బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎట్టకేలకు స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. ‘ఏపీలో చంద్రబాబుతో జరుగుతున్నది రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవ. దాని వల్ల తెలంగాణలో, ఇక్కడి ప్రజల్లో ఎలాంటి ఫలితం ఉండబోదు. కాబట్టి దీనిపై నేను వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు’ అని కేటీఆర్ అన్నారు.
సీబీఎన్కి మద్దతుగా తెలంగాణాలో జరిగిన ర్యాలీల గురించి కేటీఆర్ మాట్లాడుతూ ‘ఏపీలో ఏం జరుగుతుందో అది ఏపీలోనే ఉంటుంది. ఏపీ రాజకీయ ఘటనతో తెలంగాణలో నిరసనలు ఎలా ఉంటాయి? మేము ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాము, శాంతి భద్రతలు నెలకొల్పేందుకు బాధ్యత వహిస్తాం. అలా జరగనివ్వం. వాళ్లు ఏపీకి వెళ్లి ఎంతకైనా తెగించవచ్చు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్ట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన తీరుపై టీడీపీ నేతలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెదవి విరుస్తున్నారు. సుదీర్ఘ కాలం ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు సీఎంగా చేసిన నేత, హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చిన వారిలో ప్రథముడు అయిన చంద్రబాబు విషయంలో కేటీఆర్ వ్యాఖ్యనించిన తీరు సరికాదంటున్నారు. హైదరాబాద్ లో ఐటీని అంతలా డెవలప్ చేశాడు కాబట్టి మొదటి సారి ఐటీ ఉద్యోగులు ఆయన అరెస్ట్ పై రోడ్డెక్కారనిన అంటున్నారు.
ఆయన అరెస్ట్ ను పూర్తిగా ఖండిస్తే బాగుండేదని మరికొన్ని వర్గాలు కూడా అభిప్రాయ పడుతున్నాయి. ఏది ఏమైనా ఏపీ, తెలంగాణకు సంబంధం లేదనడం మంత్రి కేటీఆర్ కు తగదని చెప్తున్నారు.