![Visakhapatnam](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-9-5-1.jpg)
Visakhapatnam : విశాఖ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు పరుగులు పెట్టినా వారి గమ్యస్థానాలకు చేరుకోలేక పోతున్నారు. రైలు అధికారుల వింత చర్యలతో ప్రయాణికులకు వెతలు తప్పడం లేదు. ప్లాట్ ఫాంల కొరత నెపంతో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లవలసిన రైళ్లను ఒకే సమయంలో ఒకదాని వెనుక మరొకటి ఉంచడంతో ప్రయాణికులు అయోమయానికి లోనవుతున్నారు.
విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఏడో నెంబర్ ప్లాట్ ఫాంకు ముందు వైపు ఉంచగా, విశాఖ నుంచి దుర్గ్ వెళ్లాల్సిన రైలు బోగీలను దాని వెనకనే నిలుపుతున్నారు. ఇంపటర్ సిటీ రైలు సమాచారం ప్రకటనలో రైలు ముందు వైపు ఉందని ప్రకటిస్తున్నా వంతెన దిగిన వెంటనే కనిపిస్తున్న రైలు బోగీల్లోకి ప్రయాణికులు వెళ్లిపోతున్నారు. ఆ తర్వాత తాము ప్రయాణించాల్సిన రైలు ఇది కాదని తెలుసుకొని పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తాము ఎక్కాల్సిన రైళ్లను మిస్సవుతున్నారు. ఈ రెండు రైళ్లకు రద్దీ తీవ్రంగా ఉండడంతో పలువురు ప్రయాణికులు తికమక చెందుతున్నారు. రోజూ ఇదే పరిస్థితి ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు.