Tata Play : టా ప్లేలో ఉన్న తమ పూర్తి వాటాలను విక్రయించేందుకు వాల్ట్ డిస్నీ సిద్ధమైంది. ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. అమెరికా మీడియా కంపెనీ వాల్ట్ డిస్నీ తమ భారత కార్యకలాపాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా వ్యాపారాల్లో విలీనం చేస్తున్న విషయం తెలిసిందే. వాటిపై దృష్టి సారించడం కోసమే డిస్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గత నెల టాటా ప్లేలో టాటా సన్స్ తమ వాటాను 70 శాతానికి పెంచుకుంది. సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ టెమాసెక్ నుంచి 100 మిలియన్ డాలర్లకు 10 శాతం వాటాలను సొంతం చేసుకుంది. ఈ పరిణామం తర్వాత టాటా ప్లే.. టాటా గ్రూప్, డిస్నీ మధ్య 70:30 జాయింట్ వెంచర్ గా మారింది. తాజా ఒప్పందంలో భాగంగా డిస్నీ తమ ఆధీనంలోని 30 శాతవం వాటాను టాటా గ్రూప్ నకు విక్రయించినట్లు సమాచారం.
టాటా ప్లేను 2001లో టీఎఫ్ సీఎఫ్ తో కలిసి జాయింట్ వెంచర్ గా ఏర్పాటు చేశారు. సెటాప్ బాక్స్ ద్వారా టీవీ ప్రసారాలు, యాప్ ద్వారా ఓటీటీ సేవలను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా 2.3 కోట్ల కనెక్షన్లు ఉన్నట్లు టాటా సన్స్ వెల్లడించింది.