Election Surveys : ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో మూడు నెలల సమయమే ఉంది. మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటినుంచే మీడియా, సర్వే సంస్థలు తమ అంచనాలు చెప్పడం ప్రారంభించాయి. ‘‘టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ సంస్థ’’ రీసెంట్ గా సర్వే వివరాలు వెల్లడించింది.
ఈసారి కూడా లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తెలిపింది. మొత్తం 543 సీట్లలో ఎన్డీఏ కూటమి 323 సీట్లను గెలుచుకుని తిరుగులేని మెజార్టీతో మూడోసారి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్ తో కలిపి ఇండియా కూటమికి 163 సీట్లు, ప్రాంతీయ పార్టీలకు 57 సీట్లు వస్తాయని వెల్లడించింది.
కేంద్రంలో బీజేపీకి పట్టం కట్టిన సర్వే ఏపీలో అధికార వైసీపీ సత్తా చాటుతుందని తెలిపింది. 25 లోక్ సభ సీట్లలో 24-25 సీట్లను వైసీపీ గెలుస్తుందని అంచనా వేసింది. ఒక్క సీటు టీడీపీ గెలిస్తే గెలవొచ్చు అని చెప్పింది. జనసేన, బీజేపీలకు రిక్తహస్తమే అని అంచనా వేసింది.
కేంద్రంలో ఎన్డీఏ మళ్లీ అధికారం చేపట్టేందుకు పలు కారణాలు కనపడుతున్నాయి. మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క తెలంగాణలో మాత్రం అధికారంలోకి వచ్చింది. మిగతా రాష్ట్రాల్లో దారుణంగా ఓడిపోయింది. తన చేతిలో నుంచి రెండు రాష్ట్రాలను జారవీడుచుకుంది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి ఏ ప్రభావం చూపలేకపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇంతటి పరాభావం నుంచి కోలుకుని విజయం సాధించడం అంతా ఈజీ కాదు. ఇవన్నీ బీజేపీకి ప్లస్ అవుతాయి. అలాగే జనవరిలో రామమందిరం, జమ్మూ కశ్మీర్ విషయం కూడా బీజేపీ గెలుపునకు చోదకశక్తులు కానున్నాయి.
కేంద్రంలో రాబోయే ప్రభుత్వంపై కసరత్తు చేసిన సర్వే సంస్థ ఏపీ విషయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకోనట్టు కనపడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రాలో రాజకీయ, కుల సమీకరణాలు, చంద్రబాబు అరెస్ట్, తెలంగాణ ఎన్నికల ప్రభావం, యవగళం పాదయాత్ర, టీడీపీ హామీలు.. టీడీపీ, జనసేన పొత్తు.. అమరావతి ఇష్యూ, పొలవరం, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా, మూడు రాజధానులు..ఇలా వీటిలో ఏ ఒక్కదాన్ని కూడా సర్వే సంస్థ పట్టించుకోకుండా ఢిల్లీలో కూర్చుని సర్వేను వండివార్చినట్టు కనపడుతోందని టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు.
ఇంతకాలం సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని నమ్మిన జగన్.. తాజాగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ చార్జులను మార్చేస్తున్నారు. అంటే తమ ఎమ్మెల్యేలు, పథకాలు తమను గెలిపించలేవని గ్రహించారా? అని విమర్శలు వస్తున్నాయి.
తాజా టైమ్స్ నౌ సర్వే ను చూసి వైసీసీ పొంగిపొర్లుతుండవచ్చు. ప్రభుత్వంపై ఉద్యోగులు, నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఎంతో వ్యతిరేకతతో ఉన్నారు. ఇవన్నీ వైసీపీ ప్రతిబంధకాలు కావొచ్చు. కానీ అవెవీ పట్టించుకోకుండా సర్వేలు తమకు అనుకూలంగా వస్తున్నాయి కదా అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. తెలంగాణలో కూడా బీఆర్ఎస్.. ఇలాగే నిరుద్యోగులు, ఉద్యోగులు ఓట్లు వేయకున్నా తమకేం కాదు.. పింఛన్ దారులు, రైతులు, పథకాల లబ్ధిదారులు ఓట్లు వేస్తే చాలు గెలుస్తాం అనుకున్నారు. కానీ ఏమైంది నిరుద్యోగులు, ఉద్యోగులు గంపగుత్తగా కాంగ్రెస్ కు ఓటేయ్యడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇలా ఆంధ్రాలో కూడా ఏదైనా జరగొచ్చు.