Who is Jagan : ఏపీ రాజకీయాల్లోని నాయకుల తీరు ఇతిహాసాల్లోని పాత్రలను గుర్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకరు ‘మహాభారతం’ను ఉదాహరణగా తీసుకుంటే మరొకరు ‘రామాయణాన్ని’ తీసుకుంటున్నారు.
అయితే, ‘మహా కూటమి పన్నిన పద్మ వ్యూహంలో చిక్కుకునేందుకు నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని’ అంటూ జగన్ తనకు తానే జాకీలు లేపుకుంటుంటే, అర్జునుడు కాదు శిఖండి అంటూ టీడీపీ+జనసేన విమర్శిస్తున్నాయి. ఇక ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాత్రం జగన్ కుంభకర్ణుడు లాంటి వాడు అంటూ నొక్కి చెప్తున్నారు.
వైసీపీ అంటున్నట్లు జగన్ అర్జునుడా..? లేక అభిమన్యుడా..? అనే ప్రశ్నకు సమాధానం కనుక్కోవడం కష్టం కానీ.. షర్మిల అన్నట్లు జగన్ కుంభకర్ణుడా? అంటే మాత్రం సమాధానం దొరుకుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావస్తుంది. ఈ ఐదేళ్లలో ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు వరకు పరదాలు లేకుండా జగన్ ప్రజా క్షేత్రంలోకి వచ్చిన సందర్భాలు దాదాపు లేవని చెప్పవచ్చు.
ప్రజలకే కాదు పార్టీ నేతలకు కూడా అంతే.. ప్యాలస్ సీఎంగా ప్రజల నోళ్లలో మెదిలిన జగన్ ఎన్నికలు వస్తే ప్రజల్లోకి వస్తాడని చెప్పాలి. గత ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వాన్ని దోషిగా చూపి రాజకీయ ప్రయోజనం పొందిన 2 కేసుల విషయంలోనూ ఈ ఐదేళ్లల్లో నోరు విప్పి ప్రజలకు సమాధానం చెప్పలేదు.
మౌనమే తన సమాధానం అంటూ ‘కోడి కత్తి’ కేసులో విచారణకు హాజరుకాలేదు. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న అవినాష్ రెడ్డిపై సీబీఐ నీడ పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారనే అపవాదు మూటకట్టుకున్నారు. కల్తీ మద్యం బారిన పడి రాష్ట్రంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దానిపై కూడా జగన్ స్పందించలేదు. అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో ప్రజా సమస్యలపై ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ నిర్వహించని జగన్ కుంభకర్ణుడేనా..?
ఇసుక పాలిసీ మార్పు అంటూ ప్రభుత్వం ఆలసత్వం వహించగా వేలాది మంది భవన కార్మికులు ఆకలి చావులకు బలయ్యారు. అప్పుడూ జగన్ మోనంగానే ఉన్నారు. 3 రాజధానుల పేరుతో మూడు ముక్కలాటకు నిరసనగా రాజధాని కోసం భూములిచ్చిన రైతు కుటుంబాలు తమకు నాయ్యం చేయమంటూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్ల మీదే కాలం గడిపారు.
ఏనాడూ సీఎంగా జగన్ వారి సమస్యపై స్పందించలేదు., పరిష్కారం కూడా చూపించలేదు. తన తండ్రి హత్యకు న్యాయం కావాలని, తన ప్రాణానికి భద్రత కల్పించాలని ఐదేళ్ల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్న సునీత గోడు ఎన్నడూ వినలేదు. జాబ్ క్యాలెండర్ కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూసినా నిరుద్యోగుల ఎదురు చూపులు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆవిరయ్యాయనే చెప్పాలి.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలో పోలవరం పూర్తి చేస్తాం అంటూ ఇచ్చిన హామీ ఎందుకు పూర్తి చేయలదని చెప్పేందుకు మరో నాలుగేళ్ల కాలం సరిపోలేదా? రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై జరిగిన దాడుల విషయంలో మొద్దునిద్ర ఎవరిది? దేవాలయాలపై, దేవతా విగ్రహాలపై జరిగిన దాష్టికాలపై కనీస స్పందన లేకుండా గాఢ నిద్ర వహించిందెవరు? అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి తెస్తానన్న ప్రత్యేక హోదాను నిద్రపుచ్చింది ఎవరు.?
2019 తర్వాత రోడ్ల దుస్థితిని చూసీ చూడనట్లు నిద్ర నటించింది వైసీపీ ప్రభుత్వం కాదా? ఇలా రాష్ట్రంలో అనేక సమస్యలను పక్కదారి పట్టించి స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు నడుపుతుంది వైసీపీ ప్రభుత్వం కాదా? అంటూ వైస్ షర్మిల అన్న పాలనపై గొంతెత్తి నిలదీస్తోంది. వీటికి సమాధానం చెప్పలేక షర్మిలపై వ్యక్తి గత విమర్శల అస్త్రాన్ని ఎక్కుపెడుతున్న వైసీపీ విధానాన్ని చూస్తుంటే షర్మిల అన్నట్లు జగన్ కుంభకర్ణుడే అనే వాదన ఏపీ ప్రజల్లో బాగా బలపడుతుంది.