మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. అతడిని మే 5లోపు లొంగిపోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎర్ర గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్ట్ చేసుకోవచ్చని సీబీఐకు తెలంగాణ హైకోర్టు సూచించింది.
ప్రస్తుతం వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధానసూత్రధారిగా ఎర్ర గంగిరెడ్డి ఉన్నారు. అయితే తొలుత ఈ హత్య కేసును సిట్ దర్యాప్తు చేసిన తరుణంలో సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయలేదు. దీంతో ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ లభించింది. అప్పటి నుంచి బెయిల్ పై విడుదలై బయట ఉన్నాడు ఎర్ర గంగిరెడ్డి.
అయితే ప్రధానసూత్రధారినే ఇలా బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించిన సీబీఐ ఆయన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టును కోరింది. దీంతో బెయిల్ ను రద్దు చేసింది కోర్టు.
ఓవైపు భాస్కర్ రెడ్డి అరెస్ట్.. అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధమవుతున్న వేళ ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కీలకనిందితుడు అయిన గంగిరెడ్డి రేపు సీబీఐ కోర్టులో లొంగిపోతానని ప్రకటించారు. రేపు ఉదయం 10.30 గంటలకు లొంగిపోతానని ఓ మీడియాకు సమాచారం ఇచ్చారు.
ఎర్ర గంగిరెడ్డి ఈకేసులో కీలక పాత్ర పోషించారు. ఆయనే సూత్రధారిగా ఉన్నారు. సో సీబీఐ ఇతడిని విచారిస్తే అసలు హత్య ఎవరు చేశారన్నది తెలిసిపోతుంది. ఆ దిశగా కీలక ముందడుగు సీబీఐ వేసిందని చెప్పొచ్చు.