IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్ లో బ్యాటర్లు దుమ్ము రేపుతున్నారు. దీంతో బౌలర్లు కాస్త భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. బ్యాటర్ల విధ్వంసంతో బౌలర్లు ఏ కోశాన సరైన పర్ఫార్మెన్స్ చూపలేకపోతున్నారు. కానీ ఇదే ఐపీఎల్ లో కొంతమంది బౌలర్లు మాత్రం తమ సత్తాను చాటుతున్నారు. బుమ్రా అయిదు వికెట్లు తీశాడు. నటరాజన్ ఢిల్లీతో హై స్కోరింగ్ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.
సందీప్ శర్మ ముంబయి ఇండియన్స్ పై అయిదు వికెట్లు తీసి తనెంటో నిరూపించుకున్నాడు. టీ 20 మ్యాచుల్లో అయిదు వికెట్లు తీయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. టీ 20లో బ్యాటింగ్ పిచ్ లు తయారు చేస్తారు. బంతి పడితే సిక్సు, గ్రౌండ్ అవతలకే వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సిరీస్ లో బౌలింగ్ లో డాట్ బాల్స్ కూడా వేసి నిరూపించుకుంటున్నారు.
అత్యధికంగా డాట్ బాల్స్ వేసిన బౌలర్లలో ఖలీల్ అహ్మద్ ముందు వరుసలో ఉన్నారు. మొత్తం ఇప్పటి వరకు 87 డాట్ బాల్స్ వేశాడు. కగిసో రబడ ఇప్పటి వరకు 83 డాట్ బాల్స్ వేసి రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో జస్ ప్రీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. 80 డాట్ బాల్స్ వేసి ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తుషార్ దేశ్ పాండే కూడా ఎక్కువ డాట్ బాల్స్ వేసిన బౌలర్లలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇప్పటికే ఈ ఐపీఎల్ లో ఎక్కువ సిక్సర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ బౌండరీల లైన్ ను పెంచాలని డిమాండ్ చేశాడు. అంతే కాకుండా టీ 20 క్రికెట్ లో బౌలింగ్ పిచ్ లు కూడా తయారు చేయాలనే డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే బ్యాటర్ల దాడితో బౌలర్లు బెంబేలెత్తిపోతున్నారు. మరి వచ్చే ఐపీఎల్ సీజన్ లో బౌలర్లకు ఏమైనా ఫేవర్ చేస్తారో లేదో చూడాలి.