Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర అంతరాయం కలిగించిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీసుకు పిన్నెల్లి సోదరులు వెళ్లారు. సుమారు గంట పాటు అక్కడే ఉండి వివిధ అంశాలపై చర్చలు జరిపి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో ఇంట్లోని మేడపైకి వెళ్లారు.
తనను అరెస్ట్ చేయాలని ఎన్నికల సంఘం నుంచి కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు రావడంతో భయపడి అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వారి ఇంటి వెనుక ఉన్న గోడను దూకి ప్రైవేట్ వాహనంలో పారిపోయారు. మాచర్లలో తీవ్ర కలకలం సృష్టించిన పిన్నెల్లి సోదరుల కేసును ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. అన్నదమ్ములు తాడేపల్లి పర్యటన, తదనంతరం వారి చర్యల తీవ్రత.. తదనంతర పరిణామాలపై ఎన్నికల సంఘం వద్ద పూర్తి సమాచారం ఉన్నట్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు ముందు.. ఆ తర్వాత మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు చేసిన అల్లర్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పోలీసులు పిన్నెల్లి సోదరులతో కలిసిపోయి ఈ మారణ హోమం సృష్టించిందని టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే పిన్నెల్లి వైసీపీ నేతలు, కొందరు రౌడీలతో కలిసి పోలింగ్ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకొని గందరగోళం సృష్టించారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల అఘాయిత్ంపై ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు సమగ్ర నివేదిక తయారు చేసి ఈసీకి అందజేశారు.
దీంతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తమ పరిస్థితి తీవ్రతను గ్రహించిన పిన్నెల్లి సోదరులు న్యాయ పరమైన చిక్కులు రాకుండా తప్పించుకునేందుకు పారిపోయారు.