- ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ఈసీ
Elections : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇక మరికొన్ని రోజుల్లో వాతావరణం మరింత వేడెక్కనుంది. తెలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక అప్డేట్ ఇచ్చింది. కాగా తెలంగాణలో అసెంబ్లీ గడవు వచ్చే ఏడాది జనవరి 16, ఏపీ అసెంబ్లీ జూన్ 11తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం వడివడి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. తెలుగు రాష్ర్టాలతో పాటు మొత్తం 9 రాష్ర్టాల ఎన్నికలకు సంబంధించిన పనులు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఈసీ నుంచి ఒక కీలక ఆదేశాలు వచ్చాయి. ఉమ్మడి ఎన్నికల గుర్తు కోసం దరఖాస్తులు ఇవ్వాలని అందులో పేర్కొంది.
ఉమ్మడి గుర్తుపై..
ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలు ఉమ్మడి గుర్తుకోసం రిజర్వేషన్ అండ్ ఎలాట్మెంట్ 1968ను అనుసరించి ఈ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలోని పార్టీలు జూలై 17, ఏపీలోని పార్టీలు డిసెంబర్ 12 తర్వాత దరఖాస్తు చేసుకోవాలని ఈసీ వెల్లడించింది. కాగా, రానున్న ఏడాదిలో తెలంగాణ, ఏపీతో పాటు మిజోరం, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోకసభ సార్వత్రిక ఎన్నికలు కూడా జరగనున్నాయి.
ఇక వచ్చేదంతా ఎలక్షన్ హీట్..
ఏపీ, తెలంగాణలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశాలున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రజలకు వరాల ప్రకటనలో దూసుకెళ్తున్నాయి. ఏపీలో ఈసారి పోరు కీలకంగా మారనుంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీకి ఈసారి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి గట్టి పోటీ తప్పేలా లేదు. మరోవైపు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. బీజేపీ కూడా వీరితో కలుస్తుందా..ఒంటరిగా వెళ్తుందా అనేది త్వరలోనే స్పష్టత రానుంది. ఇక మూడు పార్టీలు కలిస్తే మాత్రం వైసీపీకి ముచ్చెముటలు ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మరో ఏడాది గడువు ఉన్నందున పరిస్థితులు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే..
తెలంగాణలోనూ అదే పరిస్థితి
తెలంగాణలో ఈ సారి బీఆర్ఎస్ గట్టి పోటీ తప్పేలా లేదు. ఉద్యమ పార్టీ ఆవిర్భవించి, ఫక్తు రాజకీయ పార్టీ మారిన క్రమంలో బీఆర్ఎస్ కొన్ని వర్గాలకు దూరమైందనే మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యువత సర్కారుపై గుర్రుగా ఉన్నారు. సంక్షేమ పథకాల అమలులో టాప్ లో ఉన్న రాష్ర్టం, కొన్ని వర్గాల ఆదరణను దక్కించుకోవడంలో మాత్రం ఫెయిలయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ తమ తమ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాయి. ఈ సారి బీఆర్ఎస్ ను గద్దె దించేందుకు అన్ని రకాల విన్యాసాలు చేస్తున్నాయి. రాజకీయ చతురతతో ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఉన్న కేసీఆర్ ను ఎదుర్కోవడం వీరితో సాధ్యమవుతుందా.. మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందా మరి కొన్ని నెలల్లోనే తేలనుంది. అంతవరకూ సామన్య ఓటరు పరిస్థితిని అంచనా వేసుకునే పనిలో ఉండాల్సిందే.