Ayodhya : ఈ ఏడాది జనవరి 22న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి అయోధ్య మందిరాన్ని 1.5 కోట్ల మంది సందర్శించారని రామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది. ప్రతిరోజు సుమారు లక్ష మందికి పైగా భక్తులు బాలరాముడిని దర్శించుకున్నట్లు తెలిపింది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
ఆలయం చుట్టూ 14 అడుగుల వెడల్పుతో ‘పర్కోటా’ అని పిలిచే గోడను నిర్మించనున్నట్లు శ్రీరామ జన్మభూమితీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం తెలిపారు. ‘పర్కోటా’ బహుళార్థక సాధక ప్రాంతంగా ఉంటుందని, ఇందులో ఆరు అదనపు ఆలయాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఇక్కడ శంకర భగవానుడు, సూర్య భగవానుడు, ఒక గర్భగుహ మరియు హనుమాన్, అన్నపూర్ణ దేవి, మహర్ష వాల్మీకి ఆలయాలతో పాటు మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య ఆలయ ప్రాంగణంలో నిషాద్ రాజ్, శబరి, అహల్య, జటాయువుల ఆలయాలను నిర్మించనున్నట్లు ఆయన వివరించారు.