CM Revanth Reddy Focus on Lok Sabha Elections 2024 : తెలంగాణ కాంగ్రెస్ లో నూతనోత్తేజం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. ఇక అదే జోరును లోక్ సభ ఎన్నికల్లో కొనసాగించాలని ఆ పార్టీ తహతహలాడుతోంది. ఆ పార్టీ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవల వచ్చిన పలు సర్వేలు కూడా కాంగ్రెస్ కు భారీగానే సీట్లు వచ్చే అవకాశాలున్నాయని నివేదించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడం ఆ పార్టీకి ప్రయోజనం కలుగనుంది. డబుల్ డిజిట్ సాధించి రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు తనవంతుగా సహకారం అందించాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఫుల్ క్లారిటీతోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లోక్ సభకు బలమైన అభ్యర్థులపై ఓ అంచనాకు వచ్చారని తెలుస్తోంది. వారిలో ఇతర పార్టీ నేతలు సైతం ఉన్నట్లు చెబుతున్నారు. వారితో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ఈనెల 4న ఢిల్లీలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ ఈ పేర్లను హైకమాండ్ కు సమర్పించే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు.
ఇప్పటికే ఆయా లోక్ సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్ చార్జులుగా నియమించింది. ఏఐసీసీ, టీపీసీసీ నేతలకు కూడా బాధ్యతలు అప్పగించనున్నారు. మొత్తంగా రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలపై ఏఐసీసీ కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం, పార్టీ ఓడిపోయిన చోట్ల వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేస్తున్నట్లు తెలిసింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్ కు ఓట్ల శాతం తక్కువగా వచ్చిందో, అక్కడ ఓట్ల శాతాన్ని ఎలా పెంచుకోవాలో అనేదానిపై పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని నాయకులకు ఎంపీ సీట్లు ఇస్తామని, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని, ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రతీ నియోజకవర్గంలోనూ ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. వారిని ఎలా సర్దుబాటు చేయాలనే అంశాన్ని కూడా పార్టీ హైకమాండ్ సీరియస్ గానే చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి.