CM Revanth : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మొన్నటి దాకా పాలనలో ఇప్పటి దాకా కీలక నిర్ణయాలు పెద్దగా తీసుకున్నది లేదు. కేవలం ఒకటి రెండు ఎన్నికల హామీల అమలుతోనే సరిపోయింది. అప్పటికే పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. తెలంగాణలో మూడు నెలల పాటు హోరాహోరి ప్రచారంతో రాజకీయ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ప్రధాని మొదలు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలు వచ్చి తమ ప్రచారాన్ని సాగించారు. విమర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల క్యాంపెయిన్ ముగిసింది.
పోలింగ్ ముగిసిన అనంతరం కేబినెట్ భేటీ..
పోలింగ్ ముగిసిన అనంతరం కేబినెట్ భేటీకి సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈసీ నుంచి అనుమతి రాలేదు. ఆ తర్వాత పలు షరతులతో ఈసీ అనుమతి ఇవ్వడంతో కేబినెట్ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా తన మార్క్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో చెప్పిన విధంగానే మాజీ సీఎం కేసీఆర్ ముద్ర లేకుండా చేసేలా తన అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కూడా సిద్ధమవుతున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన నిర్ణయాల పై సీఎం రేవంత్ సమీక్షలు చేస్తున్నారు.
రేవంత్ నిర్ణయాలు
పాలనలో పూర్తిగా తన మార్క్ ఉండేలా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల పైన సమీక్షలు జరుపుతున్నారు. గతంలో టీఎస్ ఉండగా.. ఇప్పుడు టీజీ తీసుకు వచ్చారు. కేసీఆర్ హయాంలో జిల్లాల సంఖ్య 33కి పెంచగా వాటిని 17కు కుదించేందుకు సాధ్యాసాధ్యాలపై సమాలోచనలు చేస్తున్నారు. జిల్లాల సంఖ్య పెంపుతో పాలన సులభమైందని, చాలా చోట్ల జిల్లా కేంద్రాలు, కలెక్టరేట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. జిల్లాలను కుదిస్తే వ్యవస్థలన్నీ తిరిగి అస్తవ్యస్తమవుతాయని ఆరోపిస్తున్నారు.కానీ సీఎం రేవంత్ మాత్రం జిల్లాల సంఖ్యను కుదించే విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
కాంగ్రెస్ మార్క్ఉండబోతున్నదా?
జిల్లాల పునర్ వ్యవస్థీకరణ సరిగా లేదనది సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం. పలు నియోజకవర్గాలు రెండు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయని, అలాంటి చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. రాష్ర్టంలో 17 జిల్లాలు సరిపోతాయని భావిస్తున్నారు. ఇక..తెలంగాణ తల్లి విగ్రహ రూపు రేఖలు మార్చడంతోపాటు సంక్షేమ పథకాల పేర్లు కూడా దాదాపుగా మార్చే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ పానలో ‘మన ఊరు – మన బడి’ స్కీమ్ ఉండగా దాని స్థానంలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు’ అనే కొత్త వ్యవస్థకు రేవంత్ సర్కారు శ్రీకారం చుట్టింది. రైతుబంధును రైతుభరోసా గా, ‘ఆసరా’ పథకం చేయూతగా మారనున్నాయి.
మార్పు తథ్యం
ప్రస్తుతం రాష్ర్టంలో అమలులో ఉన్న మొత్తం 12 పథకాల్లో మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీఎస్-ఐపాస్ పాలసీని విభజించి వేర్వేరు పాలసీలను తీసుకు రాబోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం రూపొందించిన ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ కార్యక్రమానికి ప్రత్యామ్నాయ మార్గాల దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. పాలనలో కేసీఆర్ మార్క్ లేకుండా చేయాలనేది రేవంత్ భావన. లోక్ సభ ఎన్నికల హడావిడి పూర్తయ్యాక, స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయనున్నారు. ఆ తర్వాత క్రమక్రమంగా ఒక్కో మార్పు తెరపైకి తీసుకురానున్నారు. ఏడాది చివర్లోగా ఈ మార్పులన్నీ పూర్తవుతాయనే చర్చ సాగుతున్నది. అయితే, వీటన్నింటి పైనా అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాతే నిర్ణయాలు ఉంటాయని అధికార వర్గాలతో పాటు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.