Software Company Turned The Board :
ప్రస్తుత కాలంలో ఉద్యోగమనేది అందరికీ అవసరం. చదువులు పూర్తయి అర్హతకు తగ్గ జాబ్ లభించక ఎంతో మంది వేదనకు లోనవుతున్నారు. ఇలాంటి వారు ఉన్నదేదో చేసుకొని కాలాన్ని వెళ్లదీస్తున్నారు. మరికొందరు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికే వారి చేతుల్లో పడి మోసపోతున్నారు. జేబులు గుళ్ల చేసుకుంటున్నారు. తర్వాత జరిగిన మోసం తెలుసుకొని లబోదిబోమంటున్నారు. ఇటీవల ఇలాంటి మోసగాళ్ల ఆగడాలు మరింత పెరిగాయి. నిరుద్యోగుల ఆశలు.. అవసరాలు ఆసరాగా చేసుకొని వీరంతా రెచ్చిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది.
సాఫ్ట్ వేర్ ఉద్యోగమని ఊరుకాని ఊరుకు వచ్చి అలా మోసపోయారు కొందరు. మాదాపూర్ పోలీసులు ప్రస్తుతం దీనిపై విచారణ జరుపుతున్నారు. ఏపీలోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన బిజినెపల్లి ప్రేమ్ ప్రకాశ్ సనత్ నగర్లో ఉంటున్నాడు. స్నేహితుడు లిఖిత్ తో కలిసి కొండాపూర్ లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ప్రారంభించాడు. వెస్ర్టన్ పేరల్ భవన్ లో సంతూస్ ఇన్నోవేషన్ పేరిట ఐటీ కంపెనీ మొదలుపెట్టాడు. ఒక్కో నిరుద్యోగి నుంచి లక్ష నుంచి రెండు లక్షల దాకా వసూలు చేసి ఉద్యోగాలిచ్చారు. ఆ తర్వాత రెండు నెలలు వేతనాలు మంచిగానే ఇచ్చారు. ఇక జీతాలివ్వడం మానేశారు.
దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమ కు జరిగిన అన్యాయంపై గోడు వెళ్లబోసుకున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపై పెరుగుతున్న మక్కువను ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యక్తులు ఇలా అందినకాడికి దోచుకుంటున్నారు. తమ భవిష్యత్ పై ఆశలతో ఇలా బయలుదేరిన నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారు. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు మిన్నుకుండిపోతున్నాయి. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారికి కఠిన శిక్షలు అమలు చేస్తే తప్ప, ఇలాంటి వాటికి చెక్ పడదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.