Ramojirao- jagan తెలుగు రాష్ర్టాల్లో మీడియాను కొన్నేళ్లపాటు ఏలిన రామోజీరావును ఏపీలో జగన్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతున్నది. తమ ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తూ, తన ఇమేజ్ ను దెబ్బతీస్తున్న ఈనాడు, ఈటీవీ మూలాలను దెబ్బతీయడంలో భాగంగా జగన్ సర్కారు అడుగులు వేస్తున్నది. దీంతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియా వ్యవస్థను దెబ్బతీయడమే లక్ష్యంగా ఆయన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రామోజీరావు ను ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయకున్నా, మార్గదర్శిలో ఏవో అక్రమాలు జరుగుతున్నాయంటూ హడావుడి చేస్తున్నారు.
అయితే రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి చిట్ ఫండ్ లక్ష్యంగా కొంతకాలంగా ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తున్నది. ఏపీ, తెలంగాణల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రామోజీరావుతో పాటు ఎండీ శైలజా కిరణ్ ను పలుమార్లు సీఐడీ ప్రశ్నించింది. విచారణకు పిలిచి, అవసరమైన డేటా సేకరించింది. దీంతో పాటు ఆడిటర్లు, కొందరు మేనేజర్లను జైలు కు పంపించింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో వారు విడుదలైనా వారిని వెంటాడుతూనే ఉంది. అయితే చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న వారి ఆర్థిక మూలాలే లక్ష్యంగా దాడులు చేయిసతున్నది. పోలీసులు, సీఐడీని ఇందుకు సంపూర్ణంగా వాడుకుంటున్నది.
అయితే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిని బెదిరింపులు, ఇలా దాడులు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. దీంతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారాలు అన్ని సరిగ్గానే ఉన్నాయని, డిపాజిట్ దారులకు నమ్మకంగానే తమ లావాదేవీలు కొనసాగుతున్నాయని పలుమార్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. కేవలం తమను రాజకీయ కారణాలతో ఇబ్బంది పెట్టి, ఇమేజ్ డ్యామేజ్ చేయాలనే ప్రయత్నంమే ఏపీ ప్రభుత్వం చేస్తున్నదని స్పష్టం చేసింది.
తమ డిపాజిట్ దారులు, వినియోగదారుల నమ్మకాన్ని వమ్ము చేయబోమని, అన్ని లెక్కలు పక్కాగా ఉన్నాయని మీడియా ద్వారా స్పష్టం చేస్తున్నది. అయితే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు సీఐడీ మాత్రం ఇదిగో పులి.. అదిగో మేక ఆట ఆడుతున్నట్లుగా కనిపిస్తున్నది. కేవలం ప్రభుత్వం లోని పెద్దల మెప్పుకోసమే ఈ దాడులు చేస్తూ, ఇప్పటివరకు తేల్చిదేమిటో మాత్రం బయటకు చెప్పడం లేదు. ఎంతసేపు అవినీతి అక్రమాలంటూ చెబుతున్నారు తప్పా, ఎంత అవినీతి.. ఎలా నిధులు దారులు మళ్లించారు.. ఎక్కడ పెట్టుబడులు పెట్టారు.. ఇలాంటి విషయాలేమీ తేల్చలేదు.
మరోవైపు సీఐడీ మాత్రం ప్రభుత్వ సహకారంతో మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేస్తూ వెళ్తున్నది. అయితే కక్ష సాధింపులో భాగంగా ఇదంతా జరుగుతున్నదని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారితే వారికివే ఇబ్బందులు తప్పవని, అటు టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.