MI VS RR : ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన 38 వ మ్యాచ్ లో రాజస్థాన్ ప్లేయర్లు ఆల్ రౌండ్ ప్రదర్శనతో ముంబయిపై ఘన విజయం సాధించారు. ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోగా.. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఇషాన్ కిషాన్ డకౌట్ కాగా, రోహిత్ ఆరు పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 10 పరుగులకే ఆలౌట్ అయ్యారు.
అనంతరం మహమ్మద్ నబీ, తిలక్ వర్మ పార్ట్నర్షిప్ తో కుదురుకున్నట్లు కనిపించగా.. 52 పరుగుల టీం స్కోరు వద్ద నబీ అవుటయ్యాడు. అనంతరం తిలక్ వర్మ, వాదేరా ఇద్దరు కలిసి 99 పరుగుల భాగస్వామ్యంతో ముంబయి నిలదొక్కుకుంది. వాదేరా 24 బంతుల్లోనే 49 పరుగులు, తిలక్ వర్మ 65 పరుగులతో రాణించారు. చివర్లో ఈ ఇద్దరు అవుట్ కావడంతో ముంబయి అనుకున్నంత స్కోరు సాధించలేకపోయింది.
మొత్తం 20 ఓవర్లలో 179 పరుగులు చేయగా.. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్ లో కేవలం 16 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి కెరీర్ లో ఉత్తమ గణంకాలు నమోదు చేసుకున్నాడు. బౌల్ట్ రెండు వికెట్లతో రాణించాడు. 180 పరుగుల ఛేదనలో బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో చెలరేగగా.. బట్లర్, సంజు 35, 37 పరుగులతో ముంబయి బౌలింగ్ ను ఓ ఆటాడుకున్నారు.
యశస్వి జైశ్వాల్ 7 సిక్సులు 9 ఫోర్లతో 60 బంతుల్లోనే 104 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. ముంబయి బౌలర్లు, బ్యాటర్ల సమిష్టి గా విఫలం కావడంతో రాజస్థాన్ రాయల్స్ అలవోకగా మ్యాచ్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచుల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో ప్లే ఆప్స్ కు దగ్గరైంది. ముంబయి 8 మ్యాచుల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. ముంబయి ఇంకా ఆరు మ్యాచులు ఆడాల్సి ఉండగా.. కచ్చితంగా అయిదింట్లో గెలవాలి. మంచి రన్ రేట్ ఉండాలి. ఇలా అయితేనే ప్లే ఆప్స్ కు చాన్స్ ఉంటుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోవడం ద్వారా ముంబయి తన ప్లే ఆప్స్ రేసును సంక్లిష్టం చేసుకుంది.