Monsoons Arrived : ఎండ మండిపోతుంది.. భానుడి ప్రచండ భీకరానికి మనుషులే కాదు పశుపక్ష్యాదులు, జంతువులు నీళ్లు లేక అలమటిస్తున్నాయి. వీపరీతమైన ఎండలకు రోళ్లు, రోకళ్లు బండలు కూడా పగిలిపోతున్నాయి. దాదాపు 50 డిగ్రీల వరకూ ఎండ చేరుకుంటోంది. ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితులున్నాయి. అసలు బయటకు వెళితే మాడి మసైపోవడమే. అందుకే అందరూ కూలర్లు, ఏసీలు పెట్టుకొని బతికేస్తున్నారు. కరెంట్ పోతే నరకమే.. కరెంట్ బిల్లు బారెడు వస్తోంది. ఇంతటి భీకర సూర్యభాగవానుడి భగభగల నడుమ ఓ చల్లని కబురు అందరినీ సేదతీరుస్తోంది.
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. తాజాగా దక్షిణభారతంలోని కేరళను తాకినట్టు సమాచారం. ఇది త్వరలోనే జూన్ రెండోవారానికి మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే అవకాశం ఉంది. రుతుపవనాలు వస్తున్నాయన్న మాట వింటే చాలు జనాలు పులకరిస్తున్నారు. మండే ఎండల నుంచి ఇక చల్లబడవచ్చని భరోసాగా ఉంటున్నారు.
నైరుతి రుతుపవనాల రాకతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. . రోహిణి కార్తె మే 25న రావడంతో రైతులు ఆకాశం వైపు ఆశగా చూశారు. వాతావరణ శాఖ కూడా జూన్ మొదటి వారంలోనే వర్షాలు వస్తాయని ఇదివరకే చెప్పింది. దీంతో నేడు రాష్ట్రంలోని పలు చోట్ల వానలు పడుతున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇన్నాళ్లు వేడికి తట్టుకోలేకపోయిన జనానికి ఇది తీపి కబురే. ఇక రైతులు ఏరువాక సాగుకు సిద్ధం అవుతారు. పొలాలు దున్ని విత్తనాలు వేసేందుకు సమాయత్తం అవుతారు.
ఈనేపథ్యంలో వర్షాలు రావడం నిజంగానే రైతులకు వరంగా మారింది. దీంతో వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. విత్తనాలు సకాలంలో విత్తుకుంటే పంట సరైన సమయానికి చేతికి అందుతుంది. దీంతో రైతులకు మంచి దిగుబడి వచ్చి అప్పులు తీరే మార్గం ఉంటుంది. ఇలా రుతుపవనాల రాక వారిలో సంతోషాన్ని నింపుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాల ద్వారానే వ్యవసాయం సాగుతుంది. అందుకే వీటి మీద ఆధారపడి రైతలు వ్యవసాయం చేయడం సహజమే.