Pawan Kalyan : రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ప్రజల కోసం కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జ్ఞాన వికాసానికి, ఆనందానికి, సౌభాగ్యానికి ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యభగవానుని ఆరాధించడం భారతీయ సంస్కృతిలో భాగమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఆయుర్వేద నిపుణులు కూడా ‘ఆరోగ్యం భాస్కరాదిచేత్’ అనే సూక్తిని ప్రస్తావిస్తూ ఆరోగ్యానికి సూర్యారాధన చాలా అవసరమని చెబుతుంటారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సమాజ శ్రేయస్సు, దేశ శ్రేయస్సును కాంక్షిస్తూ సూర్యారాధన చేస్తున్నట్టు ఆయన బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి ఏకాదశ దిన దీక్షలో ఉన్నారు. ఇందులో భాగంగా సూర్యారాధన చేశారు.
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ ఆదిత్య యంత్రం ముందు కూర్చుని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యక్షమైన స్వామికి పూజలు చేశారు. వేద మంత్రోక్త సూర్య నమస్కార ప్రకరణాన్ని పఠించారు. పవన్ కళ్యాణ్ నిత్యం సూర్య నమస్కారాలు చేసేవారు కానీ వెన్ను నొప్పి కారణంగా కొంతకాలంగా సూర్య నమస్కారాలు చేయలేకపోతున్నారు.
అందుకు ప్రతిగా సూర్య నమస్కారాలకు సంబంధించిన మంత్రంతో పూజలు చేసినట్లు తెలుస్తోంది. బ్రిటీష్ పాలకుల ప్రభావంతో ఆదివారం సెలవు దినంగా మారినప్పటికీ మన సంస్కృతిలో ఆదివారానికి ప్రత్యేకత ఉంది. రవివారం అని పిలిచే ఆ రోజున సూర్యుడిని ఆరాధించి పనులు ప్రారంభించారని, అందుకే ఆదివారాన్ని కృషి వారం అని కూడా పిలుస్తామని వేదపండితులు తెలిపారు. బ్రహ్మశ్రీ కోసిగంటి సుధీర్ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో వారాహి దీక్ష, సూర్య ఆరాధనలు కొనసాగుతున్నాయి.