Pending schemes :
ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నది. ముఖ్యంగా వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో చేరువైంది. ఎన్నో కుటుంబాలకు తమ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నది. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన లాంటి పథకాలతో ప్రజల మనస్సుల్లో నిలిచిపోయింది. ఇక మరోసారి రానున్నది..వైసీపీ ప్రభుత్వమే.. గెలిపించనున్నది సంక్షేమ పథకాలే.. ఇదే చర్చ జోరుగా సాగుతున్నది. ఐ ప్యాక్ టీం పైనో. సాక్షి మీడియా పైనో ఏపీ సీఎం జగన్ బాగానే నమ్మకం పెట్టుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది అదేనా.. రామగోపాల్ వర్మ సినిమా వ్యూహంలా ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఓ వ్యూహం పన్ని ఆయనకు అసలు విషయం చేరనీయట్లేదా.. అంటే అవుననే అనిపిస్తున్నది.
అయితే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు చాలా కుటుంబాలకు చేరడం లేదని తెలుస్తున్నది. అయితే రాని వారికి పథకాలు అందించడం లో భాగంగా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సురక్ష పథకాన్ని తెరపైకి తెచ్చారు. ఇన్నాళ్లు కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి కూడా ఎన్నో ఇబ్బందులు అధికారుల నుంచి ఎదురయ్యాయి. ఇప్పుడు దాని కోసం కూడా ఓ పథకం తేవడం అందరికీ విడ్డూరంగా కనిపిస్తున్నది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. సురక్ష పథకం ద్వారా ఒక్క రోజే నాలుగైదు లక్షల దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే రోజులు గడుస్తున్నా దరఖాస్తుల జోరు తగ్గలేదు. అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇన్ని అప్లికేషన్లు చూస్తుంటే ప్రభుత్వంతో పాటు అధికారుల వైఫల్యం ఇప్పుడు బయటపడుతున్నది. ఇన్ని అప్లికేషన్లు చూస్తుంటే ఇన్నాళ్లు జరిగిందేందన్నది బయటపడుతున్నది. ఇంత కాలం కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకొని.. తప్పించుకొని తిరిగిన అధికారులే ఇప్పుడు ఈ దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇన్ని పెండింగ్ లో ఉంటే, అధికారులు ఇన్నాళ్లు ఏం చేశారనేది ఇప్పుడు ప్రభుత్వానికి ప్రశ్నగా మారింది. అయితే తమ సురక్ష పథకం ద్వారానే ఇన్ని సమస్యలు పరిష్కరించే అవకాశం దక్కిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అమ్మఒడి గ్రీవెన్స్ అంటూ కార్యక్రమాన్ని గతేడాది చేపట్టిన ఓ జిల్లా కరెక్టర్ కు ఇలాంటి సమస్యే ఎదురైంది. కొన్ని వేల మంది ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆయనే దడుసుకున్నారు. ఇక మళ్లీ గ్రీవెన్స్ పెట్టలేదు. వలంటీర్లతో నెగ్గుకు వస్తామని అనుకుంటున్న వైసీపీకి ఇక ఇబ్బందికర పరిస్థితి తప్పేలా లేదు. చాలా కుటుంబాలకు పథకాలు అందడం లేదని, పాలన పారదర్శకంగా సాగడం లేదని ఈ అర్జీలు, దరఖాస్తులను చూస్తేనే అర్థమవుతున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరి దీనిపై ఏపీ సీఎం జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.