Techies Post Viral : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అభియోగాలు మోపుతూ టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని అన్ని వర్గాలు ఖండిస్తున్నాయి. వారం రోజులుగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. తొలుత టీడీపీ నాయకుల వరకే ఈ ఆందోళనలు పరిమితం కాగా, తాజాగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు కూడా వారికి జత కలిశారు. ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. చంద్రబాబును ఏపీ సర్కారు అక్రమ కేసులతో అరెస్ట్ చేసిందని మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ఆందోళనలు ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తున్నది.
అయితే గత మూడు రోజులుగా హైదరాబాద్, బెంగళూరుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఐటీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ లోని విప్రో సర్కిల్, కేపీహెచ్బీ వద్ద నిరసనలు కొనసాగగా, బెంగళూరులోని ఫ్రీడం పార్కు వద్ద ఈ నిరసనలకు పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో నిరసనలు అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనలు చేపట్టకుండా చూడాలంటూ ఆయా కంపెనీలను పోలీసులు కోరారు. దీంతో నిరసనల్లో పాల్గొనవద్దంటూ టెక్ కంపెనీలు ఓ సర్క్యులర్ జారీ చేశాయి.
ఓ ప్రముఖ కంపెనీ ఇలా జారీ చేసిన ఓ సర్క్యులర్పై ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తామేమీ వేతనాల వార్షిక పెంపు కోసమో, దీపావళి కానుకల కోసమో, అదనంగా పనిచేసిన కాలానికి చెల్లింపుల కోసమో నిరసనలకు దిగట్లేదని, మరీ ముఖ్యంగా ఆఫీసు అవర్స్లో అస్సలే చేయట్లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఓ ఉద్యోగి చేసిన పోస్టు వైరల్ అవుతున్నది. తాము న్యాయం కోసం మాత్రమే పోరాడుతున్నామని, తెలుగు రాష్ట్రాల్లో మిలియన్ల కొద్దీ ఐటీ ఇంజినీర్లకు బాటలు వేసిన నాయకుడి కోసం పోరాడుతున్నామని ఆయన అందులో పేర్కొన్నారు.
ఆయనను కాపాడుకోలేకపోతే తమకు సామాజిక బాధ్యత ఉందని చెప్పుకోవడంలో అర్థం ఏముంటుందని ప్రశ్నించాడు. అంతేకాదు, సర్క్యులర్ జారీ చేసిన మిమ్మల్ని చూసి జాలిపడుతున్నానంటూ చేసిన ఆ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు అనూహ్య మద్దతు లభిస్తోంది.
పోలీసుల ఒత్తిడితో కంపెనీల యాజమాన్యాలు ఈ సర్క్యులర్లు జారీ చేస్తున్నాయని, ఇందులో తమ మేనేజ్ మెంట్ల బాధ్యత ఏం లేదని కూడా అభిప్రాయపడుతున్నారు. ఇరు రాష్ర్టాల ప్రభుత్వాలు ఈ నిరసనలు చేపట్టకుండా ఐటీ ఉద్యోగులపై పోలీసులతో ఒత్తిడి తెస్తున్నాయని, ఇదంతా తమకు తెలియంది కాదంటూ వాపోతున్నారు. ఏదేమైనా తమ భవిష్యత్ కు బాటలు వేసిన నాయకుడి కోసం ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.