Ram Charan – Upasana : : అందరూ ఎదురు చూసిన తరుణం రానే వచ్చేసింది. దాదాపు పదేండ్లుగా మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన గుడ్ న్యూస్ ను తాజాగా రామ్ చరణ్ దంపతులు చెప్పేశారు. ఈ రోజు ఉదయం ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. త్వరలోనే ఆమె డెలివరీ ఉంటుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
నిన్న సాయంత్రం ఉపాసన, రామ్ చరణ్, సురేఖ, ఇంకో ఇద్దరు జూబ్లీ హిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో కనిపించారు. డెలివరీ కోసమే వచ్చారేమో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. వాటిని నిజం చేస్తూ ఈ రోజు ఉదయం గుడ్ న్యూస్ చెప్పేశారు. తల్లీ, కూతుర్లు ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు అపోలో డాక్టర్లు వెల్లడించారు.
దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు అంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇంకా ఈ విషయం గురించి పూర్తి అప్ డేట్ రావాల్సి ఉంది. వీరి వివాహం జరిగిన పదేండ్లకు వీరికి పిల్లలు పుట్టడంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో ఉంది. ఇన్ని రోజులు వీరు కావాలనే పిల్లలకు దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉపాసననే తెలిపింది.
తామిద్దరం లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతనే పిల్లల్ని కనాలని డిసైడ్ అయినట్టు తెలిపింది. ఇప్పుడు తాము పిల్లల్ని కనడానికి రెడీగా ఉన్నామని అందుకే స్టెప్ తీసుకున్నట్టు వెల్లడించింది ఉపాసన. ఇక ఒక్కొక్కరుగా మెగా కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
చిరంజీవి ఇంకా అపోలో ఆస్పత్రికి వెళ్లలేదని తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో ఆయన వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ షూటింగ్ కు బ్రేక్ తీసుకుని పాప దగ్గరే ఉండబోతున్నాడు.