![Kavitha](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/1092998-brsmlckavitha.webp)
Kavitha : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మూడు నెలల తర్వాత ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 15న అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆమె బెయిల్ కోసం ట్రై చేస్తూనే ఉన్నా.. బెయిల్ మాత్రం రావడం లేదు. కవిత జైలుకు వెళ్లిన తర్వాత అదే కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పై బయటకు వచ్చి ఎంపీ ఎన్నిక తంతు పూర్తి చేసుకున్నారు. అయినా కవితకు తీహార్ జైలు నుంచి తాత్కాలిక విముక్తి కూడా దక్కలేదు.
ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్ మాట్లాడుతూ త్వరలోనే కవిత బయటకు వస్తుందని, మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో క్రియా శీలంగా వ్యవహరిస్తుందని పార్టీ కేడర్ కు సంకేతాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో కవిత కస్టడీ ముగియడంతో ఆమెకు బెయిల్ రూపంలో విముక్తి వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూశారు.
మళ్లీ వారి ఆశ నిరాశగానే మిగిలింది. కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెను కోర్టుకు హాజరుపరిచారు అధికారులు.
కేసు విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్ రెవెన్యూ కోర్టు ఈ నెల 25వ తేదీ వరకు కవిత కస్టడీని పొడిగించింది. దీంతో మరోసారి నిరాశ తప్పలేదు. ఢిల్లీలో కవిత కేసు కొలిక్కి వచ్చేలోగా కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరు ఏ కేసులో అరెస్టవుతారో అనే ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తుంది.
ఇప్పటికే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ కొనుగోళ్లలో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎవరు జైలుకు వెళ్తారోనని చెప్పడం కష్టమేనని ప్రజలు అంటున్నారు.