![KCR](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/07/eeeeee.jpg)
KCR తెలంగాణలో ఎన్నికల మూఢ్ వచ్చేసింది. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. తాము గెలిస్తే చేపట్టే పనులతో పాటు ప్రత్యర్థుల తీరును ఎండగడుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అనే రీతిలో పోరుకు సిద్ధమవుతున్నాయి.ఈ క్రమంలో అధికార పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టిందివ. ఇప్పటికే పలు సంక్షేమ పథకాల అమలు ఆ పార్టీకి బలం పెంచింది. ఇటీవలే రైతు బంధు సొమ్మును రైతుల ఖాతాల్లో వేశారు. మరో వైపు బీసీ బంధు అమలుకు కూడా శ్రీకారం చుట్టారు. మరికొన్ని చోట్ల దళితబంధు నడుస్తూనే ఉంది.
అయితే ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం దివ్యాంగుల పింఛన్ ను రూ. 3016 నుంచి రూ.. 4016 చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల నుంచే ఇది అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా ఈ పింఛన్ తో 5.20 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో వచ్చాక అన్ని వర్గాలకు అందించే ఆసరా పింఛన్ ను భారీగా పెంచింది. వృద్ధులు, వితంతువులు, ఇతర వర్గాలకు రూ. 2016 ఇస్తుండగా, దివ్యాంగులకు రూ. 3016 ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం దివ్యాంగులకు పెంచారు. ఇక రానున్న రోజుల్లో ఇక వృద్ధాప్య పింఛన్ కూడా పెంచుతారని టాక్ నడుస్తున్నది. అయితే ఎన్నికల ముందు పెంచుతారా.. లేదంటే ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడుతారా అనేది త్వరలోనే తేలనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెంచిన మొత్తాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీ రాష్ర్టంలో దివ్యాంగుల పింఛన్ కేవలం రూ. 500 మాత్రమే ఉండేది. ఇప్పుడది రూ. 4016 కు చేరింది.
అయితే పింఛన్ పెంపు అనేది ఎన్నికల స్టంట్ మాత్రమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేవలం రూ.1000 వెయ్యి పెంపు ద్వారా ఆయా వర్గాల ఓట్లను తమ ఖాతాల్లో వేసుకోవాలని ఆయా పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా ఇదే పంథాలో వెళ్తున్నారు. తెలంగాణలో హ్యాట్రిక్ విజయం దక్కించుకోవాలని ఆయన అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్లు సమాచారం. అయితే పార్టీ గెలుపు కోసం ఆయన అన్ని వర్గాలను సంక్షేమ పథకాలతో టచ్ చేయాలని భావిస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మళ్లీ గద్దెనెక్కించడమే ఆయన ముందున్న లక్ష్యం. పేద వర్గాలతో పాటు దివ్యాంగులకు ఆసరా కోసం ప్రభుత్వం ఈ ఆసరా పింఛన్ అందిస్తున్నది.
ఇప్పుడు పింఛన్ దారులు, రైతులు మాత్రమే బీఆర్ఎస్ అత్యంత అనుకూల ఓటర్లుగా ఉన్నారు. ఇది అందరూ ఒప్పుకునే విషయమే. కొంతకాలంగా యువత, మరికొన్ని వర్గాలు బీఆర్ఎస్ కు దూరమవుతున్నారు. అయితే తమ సంప్రదాయ ఓటర్లను కాపాడుకోవాలంటే ఈ సారి వారికి మరిన్ని వరాలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పింఛన్ పెంపు నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులకు ఈ నెల నుంచే ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ సారి కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తిరుగుండదని అంతా భావిస్తున్నారు. ఈ నిర్ణయం తమ పార్టీ గెలుపును ఖాయం చేసిందని, ఇక రానున్న రోజుల్లో తమ అధినేత తీసుకునే నిర్ణయాలతో ప్రతిపక్షాలు కుదేలవుడు ఖాయమని బీఆర్ఎస్ శ్రేణులు స్పష్టంగా చెబుతున్నాయి.