Nadendla Manohar రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్) వాహనాల నిర్వాహకులేనని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం గడప వద్దకే రేషన్ పేరుతో 9,260 వాహనాలు కొనుగోలు చేసి, పౌర సరఫరాల సంస్థకు రూ.1,500 కోట్ల నష్టం కలిగించిందని పేర్కొన్నారు. ఎండీయూల ద్వారా రేషన్ పంపిణీపై చర్చించి, త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. రబీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.1,000 కోట్లను జాయన విజయవాడలోని పౌర సరఫరాల సంస్థ కమిషనరేట్ లో గురువారం విడుదల చేశారు.
వైసీపీ ప్రభుత్వం రూ.1,659 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించకుండా రైతుల్ని మోసం చేసిందన్నారు. వైసీపీ పాలనలో పౌరసరఫరాల సంస్థ అప్పులు రూ.36,300 కోట్లకు చేరాయని, అందులో రూ.10,000 కోట్లను వచ్చే ఏడాది మార్చిలోకా తీర్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక బ్యాంకులకు రూ.2,000 కోట్లు చెల్లించామని చెప్పారు. రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఖాళీ గోతాలకు చెల్లింపులు నిలిపివేశామని, దీనిపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు.