కూట్లో రాయి ఏరని వాడు ఏట్లో రాయి ఏరినాడని సామెత. ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందట. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అచ్చం ఇలాగే ఉంది సీఎం కేసీఆర్ పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటుతానని ప్రగల్బాలు పలికారు. ప్రస్తుతం స్తబ్దుగా మారిపోయారు. తనదైన మార్కు చూపించడం లేదు. మొహం దాచుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ దారెటు అనే సందేహాలు వస్తున్నాయి.
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభంలో మీడియాకు సైతం అనుమతి ఇవ్వలేదు. నిరాడంబరంగా కార్యాలయం ప్రారంభించారు. పరిమిత మందితోనే పార్టీ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం నిర్వహించడంపై అందరు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పార్టీగా చేసి మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన 18 స్థానాల్లో కూడా పరాభవం పాలయ్యారు. దీంతో అవమానంగా ఫీలవుతున్నారని అనుకుంటున్నారు.
పార్టీ కార్యాలయం ప్రారంభించినా సమావేశాలు మాత్రం నిర్వహించలేదు. దీంతో అందరికి సందేహాలు వస్తున్నాయి. అసలు కేసీఆర్ వ్యూహమేంటి? ఎందుకు మౌనంగా ఉన్నారు? జాతీయ పార్టీని నడపడం చేతకాదా? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? దాని భవితవ్యం ఏమిటనే వాదనలు కూడా వస్తున్నాయి.
కర్ణాటకలో కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని ప్రకటించి తరువాత మానుకున్నారు. అక్కడి పరిస్థితులు గమనించి ప్రచారం చేస్తే పరువు పోతుందని అనుకున్నారో ఏమో కానీ తరువాత ఉద్దేశం మార్చుకున్నారు. దీంతో కేసీఆర్ మాటలు నమ్మడం లేదు. బీఆర్ఎస్ కు అధికారం తెస్తానని చెప్పిన అధినేత ఇలా మాటలు మార్చడంపై అందరిలో కంగారు కలుగుతోంది. మరోపక్క మహారాష్ట్రలో పలువురు నేతలు పార్టీలో చేరుతున్నా దాని ప్రయోజనాలు మాత్రం కనిపించడం లేదు.
బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నా కుదరడం లేదు. రాష్ర్టంలోని పరిస్థితులను చక్కబెట్టుకోలేని కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఎలా కొలిక్కి తెస్తారు? జాతీయ రాజకీయాల్లో ఎలా ప్రభావం చూపిస్తారు. దీంతో కేసీఆర్ చల్లబడ్డారా? అని ఆలోచిస్తున్నారు. గతంలో ఉన్న ఆసక్తి కనిపించడం లేదు అందుకే బీఆర్ఎస్ విస్తరణపై అనుమానాలు వస్తున్నాయి.