Praveen Prakash : ఉదయం బడికి ఆలస్యంగా వచ్చి.. సాయంత్రం ముందే వెళ్లిపోతున్నారని, జీతాలు రూ.లక్షల్లో తీసుకుంటున్నా, ఫలితాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని, ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రశ్నించారు. శనివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ఎన్టీఆర్ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
పదో తరగతి ఉత్తీర్ణత శాతంలో ప్రైవేటుతో పోలిస్తే ప్రభుత్వ బడులు 20 శాతం వెనుకబడి ఉన్నాయన్నారు. క్వాలిఫైడ్ ఉపాధ్యాయులున్నా పరీక్షల్లో ఫలితాలు సరిగా రాకపోవడానికి నిర్లక్ష్యమే కారణమని, రూ. కోట్లు ఖర్చు పెట్టి సౌకర్యాలు కల్పిస్తున్నా ఫలితాలు మెరుగుపడటం లేదని అన్నారు. ఉదయం ఆలస్యంగా వచ్చి సాయంత్రం మాత్రం నిర్దేశిత సమయం కంటే ముందే వెళ్లిపోతున్నారని, ఒక్కో ఉపాధ్యాయుడికి సగటున 20 నుంచి 25 మంది పిల్లలే ఉంటున్నారని, కనీసం ఒక ఉపాధ్యాయుడు 50 మంది పిల్లలను చూడలేరా? అని ప్రశ్నించారు. ఆరవ తరగతి నుంచే విద్యార్థులకు ప్రతి యూనిట్ లో 70 శాతం మార్కులు వచ్చేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయాలు ఆయనను కలిసి మూడు నెలలుగా జీతాలు రావడం లేదని తెలుపడంతో మూడు రోజుల్లో చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.