YS Jagan : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇప్పటికే సిద్ధం పేరిట బహిరంగ సభలు, 22 రోజుల పాటు మేమంతా సిద్ధం పేరిట బస్సుయాత్ర నిర్వహించిన ఆయన మరో జైత్రయాత్రకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 28 నుంచి ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తాడిపత్రి నుంచి ప్రారంభం కానున్న ప్రచార సభల్లో ప్రతిరోజూ 3 సభల్లో పాల్గొననున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు, 30న కొండెపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్ కు వైఎస్సార్సీపీ నాయకులు తుది మెరుగులు దిద్దుతున్నట్లు తెలుస్తోంది.
ప్రతిరోజూ రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సభల్లో తన పాలనలో జరిగిన అభవృద్ధిని, సంక్షేమ పథకాలతో చేకూరిన లబ్ధిని వివరిస్తూనే.. ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఎండగట్టే అవకాశాలు ఉన్నాయి.