100 Crores Fraud :
కృష్ణా జిల్లాలో ఘరానా మోసం బట్టబయలైంది. జిల్లాలో కీలక నేతల నుంచి అందినకాడికి పెట్టుబడులు పెట్టించి, ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు సమాచారం. ఇందులో జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత ఒకరు సుమారు రూ. వంద కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు టాక్ వినిపిస్తున్నది. అయితే ఇదంతా బ్లాక్ మనీ కావడంతో, విషయం బయటకు తెలియకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నట్లు తెలుస్తున్నది.
కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో అప్పులు పెరిగిపోయాయి. దీంతో వందకు ఐదు రూపాయాలు వడ్డీ ఇస్తామని పలువురి నుంచి అప్పులు తెచ్చారు. విజయవాడ శివారులో ఓ గోడౌన్ అద్దెకు తీసుకొని సరకు నింపారు. ఈ క్రమంలో పరిచయం ఉన్న అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి నుంచి ఏకంగా వంద కోట్ల వరకు తీసుకున్నారు. నెలకు ఐదు కోట్లకు పైగా వడ్డీ చెల్లిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా ఆ ఇద్దరు చెల్లింపులు నిలిపివేశారు. ఫోన్ ఎత్తడం కూడా మానేశారు.
విషయం అనుమానించిన సదరు ప్రజాప్రతినిధి తన అనుచరులతో కలిసి హైదారాబాద్ లో నిందితుల ఇంటిపై దాడి చేశాడు. ఈ క్రమంలో ఆ ఇండ్లలో దొరికిన బంగారం, నగదు పట్టుకు వచ్చారని తెలిసింది. అయితే తనపై దాడి చేసినట్లుగా ఒక వ్యక్తి హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఇప్పుడు ఈ వ్యవహారం కృష్ణ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతున్నది. అధికార పార్టీ నేత అనగానే అందరూ ఠక్కున చెప్పేస్తున్నారు. అక్రమంగా మట్టి తరలించి పొందిన పైసలు ఇలా పరుల పాలయ్యాయని నవ్వుతున్నారు. సదరు నేత దోచినదంతా దొంగల పాలైందని సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ అంశం సంచలనంగా మారింది.