2023 Roundup : తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ముక్కోణ పోటీలో కాంగ్రెస్ గెలవడం కష్టమే అనుకున్నారు జనాలంతా. కానీ రెండు, మూడు సంఘటనలు కాంగ్రెస్ పొలిటికల్ లైఫ్ ను టర్న్ చేసేశాయి.
2014లోనే తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ ఢిల్లీ పెద్దలు భావించారు. అందుకే తెలంగాణను సైతం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అంశం నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ వద్ద నలుగుతూనే ఉంది. తర్వాత ఇందిరా హయాంలో 1969 ఉద్యమం.. 369 మంది యువకుల కాల్చివేత..ఆ తర్వాత 2021 నుంచి టీఆర్ఎస్ నేతృత్వంలో మలిదశ ఉద్యమం..2004 ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు.. అధికారంలోకి రావడం.. ఇలా తెలంగాణ ప్రతీ సన్నివేశం.. కాంగ్రెస్ తో విడదీయరానిది.
ఇక యూపీఏ ఫస్ట్ టర్మ్ లో తెలంగాణ ఇవ్వడానికి మొండిచెయ్యి చూపింది.. 2009లో కేసీఆర్ అమరణ దీక్షతో ఉద్యమం ఊపందుకుంది. ఇక చివరకు డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది. ఆ తర్వాత ఆంధ్రానేతల ఒత్తిడికి తలొగ్గి ఆ ప్రకటన వెనక్కి తీసుకోవడం.. ఇలా ఎన్నో ఘటనల తర్వాత 2014 లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ముందట అనగా 2014 ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పాస్ చేయించగలిగింది.
ఏపీలో ఓడినా, తెలంగాణ అధికారంలోకి వస్తామని నమ్మే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందనడంలో ఎలాంటి డౌట్స్ లేవు. ఇక టీఆర్ఎస్ ను తమ పార్టీలో విలీనం చేసుకోవాలని భావించింది. కానీ కేసీఆర్ .. ఆ పార్టీకి ధమ్కీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే జనాలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ వైపే మొగ్గి అధికారం కట్టబెట్టారు.
అలా నాలుగున్నరేండ్లు గడిచినా తర్వాత 2018 ఎన్నికల్లో టీడీపీతో కలిసి ‘మహాకూటమి’ కట్టగా.. ఆ కూటమిని టార్గెట్ చేస్తూ జనాల్లోకి వెళ్లిన కేసీఆర్ .. రెండోసారి 86 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చారు. రెండోసారి కూడా కాంగ్రెస్ ఆశ నెరవేరలేదు. ఇక కాంగ్రెస్ పని అయిపోయిందని భావించారు. కాంగ్రెస్ లో నేతల కలహాలు, టీడీపీ నుంచి వచ్చి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రేవంత్ కు సహకరించని సీనియర్లు.. ఇలా కాంగ్రెస్ హస్తవ్యస్తంగా మారిపోయింది.
అయితే సెకండ్ టర్మ్ లో బీఆర్ఎస్ కాస్త జనాలను నిరాశ పరిచింది. ముఖ్యంగా నిరుద్యోగులు, ఉద్యోగులు తమకు తీవ్ర అన్యాయం జరిగిందని భావించారు.
ఈ నేపథ్యంలో 2023 ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. అప్పటికీ కాంగ్రెస్ పని అయిపోయిందనే అనుకున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర, కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్షుడిగా తీసెయ్యడం లాంటి ఘటనలు కాంగ్రెస్ కు బాగా కలిసొచ్చాయి. కాంగ్రెస్ నెత్తిమీద పాలు పోసినట్టుగా బీఆర్ఎస్ వేసిన 80వేల పోస్టుల నోటిఫికేషన్లు అభాసుపాలయ్యాయి. గ్రూప్-1 సహ వివిధ పరీక్షల లీకేజీలు, గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండు సార్లు రద్దు కావడం, గ్రూప్-2 వాయిదాలు.. కానిస్టేబుల్ పరీక్షలో 46 జీవో వివాదం.. ఇలా ఒక్కటేమిటీ ప్రతి నోటిఫికేషన్ నానా రభసగా మారింది. నిరుద్యోగులు బీఆర్ఎస్ పై కన్నెర్ర చేశారు. కాంగ్రెస్ కు గంపగుత్తగా మద్దతు తెలిపారు. ఇక ఉద్యోగులదీ అదే పరిస్థితి.
ఇలా సబ్బండ వర్గాల మద్దతు.. తాను ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ కు ఇక తిరుగులేకుండా పోయింది. ‘‘బీఆర్ఎస్ కు పదేళ్లు అధికారం ఇచ్చాం.. ఓ సారి కాంగ్రెస్ కు ఇచ్చి చూద్దాం..’’ అని జనాలు ఫిక్స్ అయ్యారు. అలాగే సీనియర్లు అందరూ తమ తమ నియోజకవర్గాల్లోనే ప్రచారం చేసుకుంటున్నా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒంటిచేత్తో రాహుల్ , ప్రియాంకల సపోర్ట్ తో బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీల్లో పాల్గొన్నాడు. తన వాగ్దాటితో బీఆర్ఎస్ పాలన వైఫల్యాలను జనాల్లో ఎత్తిచూపాడు. ఇలా అన్ని అంశాలు కలిసి రావడంతో డిసెంబర్ 3న ప్రకటించిన ఫలితాల్లో 64 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7 సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తమ మ్యానిఫెస్టో అమలుకు తగిన చర్చలు తీసుకుంటున్నారు.