- ఢిల్లీలో వరుస భేటీలు
Karnataka : కర్ణాటకలో గెలుపెమో కాని కాంగ్రెస్ పెద్దలకు మాత్రం పెద్ద తలనొప్పినే తెచ్చి పెట్టింది. మొదటి నుంచి కాంగ్రెస్ లో అన్ని రాష్ర్టాల్లో ఇదే లొల్లి ఉంటుందని చర్చ కొనసాగుతున్నది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి, నాలుగో రోజుకు చేరుకున్నా సీఎం అభ్యర్థిని తేల్చేందుకు పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతున్నది. ఎవరిని ఎంపిక చేస్తే ముప్పు ఎటు నుంచి ముంచుకు వస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అసలే బలమైన ప్రత్యర్థి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాుడు. చీలిక తెస్తే పరిస్థితి ఏంటని కూడా ఆలోచిస్తున్నది. మొత్తానికి కర్ణాటకలో కింగ్ ఎవరనేది మంగళవారం అయినా తేలుతుందా అనేది కొంత అనుమానంగానే కనిపిస్తున్నది.
ఎందుకీ రచ్చ..
కర్ణాటక కాంగ్రెస్ లో ఇద్దరు బాహుబలి లాంటి నేతలు ఉన్నారు. ఒకరు సిద్ధరామయ్య కాగా మరొకరు డీకే శివకుమార్. ఇద్దరూ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు పని చేశారు. డీకే శివకుమార్ అయితే అన్నీ తానై నడిపించారు. మొదటి నుంచి పార్టీ విధేయుడిగా ఉంటూ కష్టకాలంలోనూ అండగా నిలబడ్డారు. ఒక సైనికుడిలా అన్నింటినీ ఎదుర్కొంటూ సవాళ్లను ఎదుర్కొని గట్టిగా నిలబడ్డారు. ఇక సిద్ధరామయ్య కూడా పార్టీకి వీర విధేయుడే. అయితే ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు సీఎం సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇద్దరికీ ఎమ్మెల్యేల బలం ఉంది కూడా. ఏకంగా శివకుమార్ అయితే తనకు 135 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఇరువురిని ఢిల్లీకి పిలిచినా డీకే మాత్రం ఇంకా వెళ్లలేదు. తనకు ఆరోగ్యం బాగా లేదని చెప్పారు. మరోవైపు అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే, తానే సీఎం అనే రీతిలో వ్యాఖ్యలు కూడా చేశారు.
అయితే పార్టీ ఇదంతా సునిశితంగా పరిశీలిస్తున్నది. మధ్యస్థంగా ఇద్దరికీ చెరో రెండున్నరేండ్లు పదవిని కట్టబెట్టాలని కూడా భావిస్తున్నది. మొత్తానికి ఇద్దరు నేతలు పట్టువీడడం లేదు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ కు తలనొప్పిలా భావిస్తున్నది. అయితే మరో అంశం ఏంటంటే ఇద్దరు నేతలకే పరిస్థతి ఇలా ఉంటే , రేపు తెలంగాణలో ఇంకా ఎలా ఉంటుందని టాక్ నడుస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ లో అగ్ర నాయకులంతా మేమే సీఎంలం అని చెప్పుకొని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిని సీఎంగా ఎంపిక చేయాలనేది పార్టీ హై కమాండ్ కు తలనొప్పిలా మారుతుంది. ఏదేమైనా కాంగ్రెస్ లో కొంత ప్రజాస్వామ్యమెక్కువేనని మాట్లాడుకుంటున్నారు. దీనిపై మీమ్స్ కూడా విడుదల చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు మారదని, మొదటి నుంచి ఇంతేనని విమర్శిస్తున్నారు.