ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తెలంగాణ కు మకాం మార్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఇప్పుడు అక్కడ పార్టీ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య సునీల్ కనుగోలును ఏకంగా ప్రధాన సలహాదారుగా నియమించుకున్నారు. తద్వారా సునీల్ కు క్యాబినెట్ హోదా దక్కింది.
అయన తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సర్వే జరపబోతున్నట్లు, గెలుపు గుర్రాలను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా వివిధ వర్గాలతో సమాచారం తెప్పించుకుంటున్నారు. అన్నింటినీ సిద్ధం చేసి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థుల పేర్ల తో నివేదికను సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు 70 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయినట్లు సమాచారం. మిగిలిన సీట్లలో పోటీ చాలా తీవ్రంగా ఉండడంతో తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కొందరు సీనియర్ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో దాదాపు వారి పేర్లే ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. నల్గొండ, అదిలాబాద్, కరీంనగర్ ఖమ్మం జిల్లాలో దాదాపుగా మెజారిటీ అభ్యర్థుల ఖరారు పూర్తయినట్లు సమాచారం. కొత్తగా చేరికల నేపథ్యంలో కొన్ని మార్పులు ఉండే అవకాశం కూడా ఉంది.
అయితే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక రసవత్తరంగా మారిన నేపథ్యంలో సునీల్ కనుగోలు టీం ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి పరిస్థితిని పార్టీకి అందించనుంది. గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నది. లేదంటే మూడోసారి కూడా ప్రతిపక్ష పాత్ర కే పరిమితం కావాల్సి వస్తుందని భావిస్తున్నది. ఈసారి కూడా ఎన్నికల్లో ఓడిపోతే పార్టీని ప్రజలు మర్చిపోతారని ఎలాగైనా అధికారంలోకి రావాలనే పట్టుదలతో ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలోనే సునీల్ కనుగోలు టీం ఇక తెలంగాణలో పూర్తి స్థాయిలో పనిచేయబోతున్నది. మరి కర్ణాటకలో లాగే ఇక్కడ కూడా ఆయన సక్సెస్ అవుతారో లేదో వేచి చూడాలి.