BRS political game : గత రెండు ఎన్నికల్లో చంద్రబాబును టార్గెట్ చేసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పడు ఏపీ సీఎం జగన్ ను కూడా లక్ష్యంగా చేసుకొని మాటల తూటాలు పేలుస్తున్నారు. తాము గొప్పగా పాలిస్తున్నామని చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఏపీని పావుగా వాడుకుంటున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దిట్ట. మొన్నటి కరెంట్ మీటర్ల విషయంలో జగన్ ను టార్గెట్ చేసిన హరీశ్ సాయం కోసం అప్పులు కావాలంటూ కేంద్రం వద్ద మోకరిల్లుతున్నారంటూ జగన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.
అయితే మరోసారి జగన్ తో పాటు చంద్రబాబుపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి హరీశ్ రావు ఏపీ విషయాలను ప్రస్తావించారు. జగన్, చంద్రబాబు వల్లే ఆంద్రప్రదేశ్ ఎటు కాకుండా పోయిందని విమర్శించారు. వాళ్లకు ప్రచారం తప్ప అభివృద్ధి పట్టదని ఆరోపణలు గుప్పించారు. అయితే వారి పేర్లు చెప్పకుండా విమర్శలు మాత్రం చేస్తున్నారు. అయితే వారిద్దరూ చంద్రబాబు, జగన్ అని అర్థమవుతున్నది. సంగారెడ్డికి ఆంధ్రా నుంచి వలస వచ్చిన కార్మికులే ఎక్కువగా ఉంటారు.. గతంలోనూ ఇలాగే విమర్శంచారు. ఇక్కడికి వలస వచ్చిన వారంతా ఆంద్రా నుంచి తెలంగాణకు తమ ఓట్లు మార్పించుకోవాలని సలహా ఇచ్చారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పరిశ్రమలు, పెట్టుబడులు ఏపీకే వెళ్లాయి. హీరో ప్లాంట్, కియా ప్లాంట్ వంటి వాటి కోసం తెలంగాణ ఎంత పోటీ పడినా ఫలితం లేకపోయింది. విభజన తర్వాత ఏపీని పారిశ్రామికంగా తీర్చిదిద్దడానికి బాబు చేసిన ప్రయత్నాలు.. తెలంగాణ ప్రతికూలంగా మారాయి. ఈ కారణంగానే వైసీపీకి మద్దతిచ్చానే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ గెలిచిన తర్వాత ఏపీకి వచ్చిన ప్లాంట్లు అన్నీ తెలంగాణకు మళ్లాయి. చివరికి ఏపీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన అమరరాజా కంపెనీ కూడా తెలంగాణకు చేరుకుంది. ఇప్పుడు తెలంగాణ నేతలు ఏపీని ఎగతాళి చేస్తూ విమర్శలు చేస్తున్నారు.